- ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు, వెలుగు: గంజాయి నిర్మూలనకు గ్రామస్థాయిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు బలమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి, సప్లయ్ చైన్ను ఛేదించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యువత గంజాయి బారిన పడుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.
అక్రమ మద్యం, నల్లబెల్లం తయారీ, రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
