
- మెడికల్ లీవ్కు సంబంధించిన జీతం బిల్ చేసేందుకు రూ. 60 వేలు డిమాండ్
- భద్రాద్రి జిల్లాలో సింగరేణి ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఏసీబీ
- అన్ఫిట్ సర్టిఫికెట్ ఇస్తామంటూ డబ్బులు వసూలు
ములుగు, వెలుగు : తనతో పని చేస్తున్న ఉద్యోగి నుంచే లంచం డిమాండ్ చేసిన ఓ జడ్పీ సూపరింటెండెంట్తో పాటు మరో ఉద్యోగిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... వెంకటేశ్ అనే ఉద్యోగి ములుగు జడ్పీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతడు గతంలో ఏడు నెలలు మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
ఆ లీవ్లకు సంబంధించిన జీతం కోసం బిల్లులు రెడీ చేసి ఎస్టీవో ఆఫీస్కు పంపించాలని సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్ను కోరాడు. అయితే బిల్లులు చేసేందుకు రూ. 60 వేలు ఇవ్వాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేశాడు. ముందుగా తనకు రూ.20 వేలు ఇచ్చి, మరో ఉద్యోగి సౌమ్యకు అదనంగా రూ. 5 వేలు ఇవ్వాలని, మిగిలిన రూ. 40 వేలను బిల్లు మంజూరు అయ్యాక ఇవ్వాలని చెప్పాడు.
దీంతో జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్ వరంగల్ ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు మంగళవారం జడ్పీ ఆఫీస్కు వచ్చి సూపరింటెండెంట్ సుధాకర్కు రూ. 25 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుధాకర్తో పాటు ఉద్యోగి సౌమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
కొత్తగూడెంలో సింగరేణి కార్మికుడు...
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అన్ఫిట్ సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన సింగరేణి ఉద్యోగిని మంగళవారం ఏసీబీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. ఏసీడీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... అన్నెబోయిన రాజేశ్వర్రావు అనే వ్యక్తి సింగరేణి కాలరీస్ కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని మెయిన్ వర్క్ షాప్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతడితో పాటు మరికొందరు కలిసి కారుణ్య నియామకాల్లో భాగంగా అమలు చేస్తున్న మెడికల్ బోర్డులో అన్ఫిట్ సర్టిఫికెట్ ఇస్తామని, ట్రాన్స్ఫర్స్, పేరు మార్పు చేయిస్తామని చెప్పి పలువురి వద్ద రూ. 32 లక్షలు వసూలు చేశాడు.
ఈ విషయంపై విచారణ చేసిన సింగరేణి విజిలెన్స్ ఆఫీసర్లు మూడు వారాల కింద ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణలో రూ. 32 లక్షల కంటే ఎక్కువే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. పేరు మార్పుకు సంబంధించి ఒకరి వద్ద నుంచి రూ. 3 లక్షలు తీసుకున్నట్టు తేలింది. బాధితులను సైతం విచారించి, అక్రమాలు నిజమేనని తేలడంతో రాజేశ్వర్రావును అరెస్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.