సజ్జన్​ జిందాల్​పై రేప్​ కేసు

సజ్జన్​ జిందాల్​పై రేప్​ కేసు

ముంబై: పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌‌‌‌పై ముంబై పోలీసులు  అత్యాచారం, వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. జిందాల్ జేఎస్​డబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 13న కేసు నమోదు చేశారు. అయితే నిందితుడిని ఇప్పటి వరకు పోలీసులు ప్రశ్నించలేదు.  పోలీసులు  ఐపీసీ సెక్షన్లు 354 (మహిళా మర్యాదను తగ్గించేలా ఆమెపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 376 (రేప్​),  506 (బెదిరింపు) సెక్షన్లను ప్రయోగించారు. 

వృత్తిరీత్యా డాక్టర్,  మోడల్ అయిన 30 ఏళ్ల మహిళ వాంగ్మూలం ప్రకారం,  జిందాల్ తన పెంట్‌‌‌‌హౌస్‌‌‌‌ని ఆమెకు చూపించే నెపంతో  బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లోని జేఎస్‌‌డబ్ల్యూ ఆఫీసుకు పిలిచారు. ఆ తర్వాత ఆమెను భవనం పై అంతస్తు బాత్‌‌‌‌రూమ్‌‌‌‌లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు.  2021 అక్టోబర్‌‌‌‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​కు ప్రాపర్టీ కన్సల్టెంట్‌‌‌‌గా ఉన్న ఆమె సోదరుడి ద్వారా ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. 

అదే ఏడాది ఆమె జైపూర్‌‌‌‌లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి పెళ్లిలో జిందాల్‌‌‌‌ను మళ్లీ కలుసుకుంది. ఇద్దరూ నంబర్లు మార్చుకుని స్నేహం కొనసాగించారు. ఈ ఘటన జరిగిన తరువాత జిందాల్​ తన ఫోన్​ను ఎత్తడం మానేశాడని, పైగా బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.