
- మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో పలు హోటళ్లలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
- ఓ కేఫ్ సీజ్, పలు హోటళ్లకు రూ. 1.55 లక్షల జరిమానా
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ మున్సిపాలిటీలోని హోటళ్లు, కేఫ్ లలో మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్ శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పలు హోటళ్లు, కేఫ్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో నిల్వ చేసిన చికెన్, ఆహార పదార్థాలు ఉన్నట్లు గమనించారు.
ట్రేడ్ లైసెన్స్లు పొందకుండా కమర్షియల్ పన్ను చెల్లించకుండా రెసిడెన్షియల్ బిల్డింగ్లో హోటళ్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సుమారు రెండు గంటలకుపైగా తనిఖీలు నిర్వహించి మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సీజ్ చేశారు. చిల్ కేఫ్ రెస్టారెంట్, టీ వనం కేఫ్నకు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
శ్రీ కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ రూ. 50 వేలు, ఎస్ ఎస్ఎస్ రెస్టారెంట్ రూ. 20 వేలు, ఖలీల్ దాబా రూ. 30 వేలు, కృష్ణ పట్నం రెస్టారెంట్ రూ.30 వేలు, దావత్ రెస్టారెంట్ రూ. 25 వేలు జరిమానా విధించారు. పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న సాయిరాం మోటార్స్ను సీజ్ చేయగా విట్రోస్ మూవీ థియేటర్ ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని హెచ్చరించారు. తనిఖీల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, రవితేజ, మున్సిపల్ మేనేజర్ జ్ఞానేశ్వరీ, టౌన్ ప్లానింగ్ అధికారులు అంజయ్య, చరణ్ తేజ, శంకర్ ఉన్నారు.