- సంపన్నుల లిస్ట్లో మనోళ్లు 78 మంది
- ఇండియా రిచ్లిస్టులో టాప్లో గౌతమ్ అదానీ, రెండో ప్లేస్కి ముకేశ్ అంబానీ
- వెల్లడించిన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్లిస్ట్ 2022
బిజినెస్ డెస్క్, వెలుగు: రిచ్లిస్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 78 మందికి చోటు దక్కింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్–హురున్ రిచ్లిస్ట్ 2022 లో తెలుగు రాష్ట్రాల నుంచి దివీస్ ల్యాబోరేటరీస్కు చెందిన మురళి దివి ఆయన ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలిచారు. వీరి సంపద రూ. 56,200 కోట్లుగా ఉంది. రూ.39,200 కోట్ల సంపదతో రెండో ప్లేస్లో హెటెరో బీ పార్ధసారధి రెడ్డి, ఆయన ఫ్యామిలీ ఉంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఆంధ్ర, తెలంగాణ రిచ్లిస్టులోని 78 మంది సంపన్నుల మొత్తం సంపద రూ. 3,90,500 కోట్లుగా ఉంది. విర్కౌవ్ ల్యాబొరేటరీస్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి ముగ్గురేసి చొప్పున ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఈసారి ఈ లిస్టులో 11 మంది కొత్త వారు చోటు దక్కించుకున్నారు. లిస్టులో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రూ. 8,700 కోట్ల సంపదతో మహిమ దాట్ల అత్యంత సంపన్నురాలైన మహిళగా నిలిచారు. ఒక్క ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీ నుంచే 24 మంది సంపన్నులు వచ్చారు. ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 లో సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయి.
ఈ రెండు రాష్ట్రాల నుంచి 78 మందికి చోటు దక్కింది. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి రూ. వెయ్యి కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈ రిచ్ లిస్టులో 64 మంది హైదరాబాద్ నుంచి ఉండగా, 5 మంది విశాఖపట్నం నుంచి, ముగ్గురు రంగారెడ్డి నుంచి ఉన్నారు. ఫార్మా సెక్టార్లోని సంపన్నుల్లో 31 శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్స్ట్రక్షన్, కెమికల్స్ సెక్టార్ల నుంచి కూడా ఈ రాష్ట్రాల నుంచి సంపన్నులు ఉన్నారు. రానున్న కాలంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్లిస్టులో ఈ రెండు రాష్ట్రాల నుంచి మరింత మంది జాయిన్ అవుతారని అంచనావేస్తున్నాం’ అని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఏపీ అండ్ తెలంగాణ రిచ్లిస్ట్ 2022 ఫౌండర్ యాటిన్ షా అన్నారు. 11 ఏళ్ల కింద ముగ్గురుగా ఉన్న ఈ రిచ్లిస్టులోని మెంబర్లు తాజాగా 26 రెట్లు పెరిగారని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ ఆనస్ రెహ్మన్ జునైద్ పేర్కొన్నారు.
అత్యంత సంపన్నురాలైన మహిళగా నైకా ఫాల్గుణి నాయర్
బయోకాన్ బాస్ కిరణ్ మంజుదార్షా (69) ను దాటి దేశంలో అత్యంత సంపన్నురాలైన సెల్ఫ్మేడ్ వుమెన్గా నైకా ఫౌండర్ ఫాల్గుణి నాయర్ (59) నిలిచారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్లిస్ట్ 2022 లో మహిళా సంపన్నులు 55 మంది ఉన్నారు. 10 ఏళ్ల కింద కేవలం 13 మంది మహిళా సంపన్నులు మాత్రమే ఈ రిచ్లిస్టులో చోటు దక్కించుకున్నారు. ‘ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా స్టార్టయిన ఫాల్గుణి నాయర్ బ్యూటీ ప్రొడక్ట్లను ఆన్లైన్లో అమ్మడం ద్వారా కొత్త విప్లవం క్రియేట్ చేశారు. ఆమె స్టార్టప్ నైకా దేశంలోనే లాభాల్లో నడుస్తున్న స్టార్టప్లలో ఒకటిగా ఉంది.
గత రెండేళ్ల నుంచి బ్యూటీ ప్రొడక్ట్లే కాకుండా ఫ్యాషన్, లైఫ్స్టైల్ ప్రొడక్ట్లను కూడా నైకా అమ్ముతోంది. కంపెనీ పోర్టుఫోలియోలో 2,600 కు పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్లు, 100 కు పైగా ఆఫ్లైన్ స్టోర్లు ఉండడం గమనించాలి. తాజాగా ఐపీఓ ద్వారా నైకా క్యాపిటల్ సేకరించింది’ అని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్లిస్ట్ వివరించింది. ఉక్రెయిన్ యుద్ధం లేదా ఇన్ఫ్లేషన్ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ కొనసాగుతోందని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ రెహ్మన్ జునైద్ పేర్కొన్నారు.