జాంబీలా డెంగ్యూ దోమ..మొండిఘటంగా మారుతున్న వైరస్

జాంబీలా డెంగ్యూ దోమ..మొండిఘటంగా మారుతున్న వైరస్
  • ఫాగింగ్, కెమికల్స్​కూ చనిపోకుండా ముదురుతున్న దోమలు
  • దోమల నర్వస్​ సిస్టమ్​ను హైజాక్ చేసి లక్షలకొద్దీ వైరస్​ రెప్లికేషన్లు
  • రక్తదాహం తీరకుండా సెలైవా గ్లాండ్స్​ ఆధీనంలోకి..
  • ఏడాదంతా బతికేలా నాలుగు రకాలుగా మార్పులు
  • సీసీఎంబీ, ఐఐసీటీ స్టడీలో ఆందోళనకర విషయాలు
  • హైదరాబాద్​లోని పలు ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరణ


హైదరాబాద్, వెలుగు:దోమల బెడద నివారించేందుకు సాయంత్రం కాగానే సిబ్బంది ఫాగింగ్ చేస్తుంటరు. నీటివనరుల మీద కిరోసిన్, కెమికల్​ ద్రావణాలు పోస్తుంటరు. ఆ దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి రోగాలను కొంతైనా నియంత్రించాలన్నది అధికారుల తాపత్రయం. కానీ, ఇప్పుడు ఆ ఫాగింగ్, కెమికల్స్​కూ డెంగ్యూ వైరస్​ లొంగట్లేదంటే నమ్ముతారా..? హెచ్ఐవీ లాగానే ఈ డెంగ్యూ వైరస్​కూడా తన రూపాన్ని మార్చుకుంటూ మహా మొండిఘటంగా పరిణమిస్తున్నది. 

తనకు అనుగుణంగా దోమ మైండ్​సెట్​నే మార్చే స్తున్నదీ వైరస్. హైదరాబాద్​లోని సీసీఎంబీ, ఐఐసీటీ సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కాప్రా, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల నుంచి వైరస్​ శాంపిళ్లను సేకరించి అధ్యయనం చేసిన సైంటిస్టులు.. వైరస్​లోని జన్యువులు మ్యుటేట్​ అవుతున్నట్టు గుర్తించారు. ఫాగింగ్​ చేసినా.. కెమికల్స్​ చల్లినా దోమ చనిపోకుండా ఆ వైరస్​ కాపాడుతున్నట్టు తేల్చారు. ఒక రకంగా డెంగ్యూ వైరస్​ను మోసుకొచ్చే ఈడిస్​ ఈజిప్టీ దోమలోని నర్వస్​ సిస్టమ్​ను హైజాక్​ చేసేసి.. ఒక జాంబీలాగా ఆ దోమను మార్చేస్తున్నదని గుర్తించారు. ఏండ్లకొద్దీ చేస్తున్న రొటీన్​ ఫాగింగ్​కు ఇటు దోమ, అటు వైరస్​ రెండూ కూడా అడ్వాన్స్​ అయిపోయి వాటిని మార్చుకుంటున్నాయని చెప్తున్నారు.

పక్క దోమలకూ అంటిస్తున్నయ్..

డీలో మరో ఆందోళనకరమైన విషయం తేలింది. డెంగ్యూ దోమలు మొండిగా తయారవ్వడమేకాకుండా.. పక్కన ఉండే మామూలు దోమలకూ డెంగ్యూను అంటిస్తున్నట్టు వెల్లడైంది. ఫాగింగ్​ వంటి చర్యలేవీ దానిని నిరోధించలేకపోతున్నాయని తేలింది. దోమను చావనివ్వకుండా ఆ వైరస్​ తనను తాను మార్చుకుంటున్నదని, దోమలను అగ్రెసివ్​గా మారుస్తున్నాయని స్టడీ వెల్లడించింది. దోమల నర్వస్​ సిస్టమ్​ను హ్యాక్​ చేసి.. ఆ దోమ బయాలాజికల్​ క్లాక్​ను నాశనం చేసి వైరస్​ చెప్పినట్టు నడుచుకునేలా సాధారణ దోమలను సైతం హంటింగ్​ మెషీన్లుగా మారుస్తున్నాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు.. దోమ రక్తదాహం తీరకుండా ఆ దోమలోని సెలైవరీ గ్లాండ్స్​ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటున్నదని తేలింది. ఒక వ్యక్తి లేదా చాలా మంది వ్యక్తుల నుంచి నిరంతరం రక్తాన్ని పీల్చేలా వైరస్​ చేస్తున్నదని వెల్లడైంది. దీని వల్ల ఎక్కువ మంది డెంగ్యూ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మట్టుబెట్టడం కష్టమేనా?

వైరస్​, దోమలను మట్టుబెట్టడం కష్టమేనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఏడాదంతా యాక్టివ్​గా ఉండేలా నాలుగు వేర్వేరు వెర్షన్లుగా ఆ వైరస్​ మారిపోతున్నట్టు స్టడీలో తేలింది. దీంతో స్థానికంగా ఉండే ఇతర దోమలను ఇన్​ఫెక్ట్​ చేస్తుండడంతో.. దానిని కంట్రోల్​ చేయడం కష్టతరమవుతుందని చెప్తున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒక్క చిన్న దోమలో లక్షలకొద్దీ ఆ వైరస్​ రెప్లికేట్​ అవుతుండడంతో అడ్డుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   బయట ఉండే నీళ్లలోనే కాదు, ఇంట్లో ఉండే చిన్నపాటి మొత్తం ఉండే నీటిలోనూ డెంగ్యూ వైరస్​ ప్రమాదకరంగా వృద్ధి చెందుతున్నట్టు చెబుతున్నారు. ఫ్రిజ్​లోని డ్రిప్​ ట్రేలు, కూలర్​ ట్యాంకులు, పూల కుండీలు, ఇంటిపైన ఉండే వాటర్​ ట్యాంక్​, ఏసీ కండెన్సర్​ పైపుల్లోనూ ఈ డెంగ్యూ దోమలు తమ జాతిని వృద్ధి చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు, ఆఫీసులు, ఇతర పబ్లిక్​ ప్లేసుల్లోనూ ఈ డెంగ్యూ దోమలు పొంచి ఉంటున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.