- అంతకు ముందువి కొన్ని పెండింగ్
- ఆన్లైన్ ప్రాబ్లమ్ అంటున్న పంచాయతీ ఆఫీసర్లు
- రిజిస్ట్రేషన్లు ముగిసినా హక్కుదారులు కాని ఓనర్లు
- హౌస్లోన్ తీసుకోలేక అవస్థలు
నిజామాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీల పరిధిలో ఇండ్లు కొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, మ్యుటేషన్లు జరగడం లేదు. దీంతో ఇండ్లు కొన్న ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నుంచి మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ఆన్లైన్ సైట్ ప్రాబ్లమ్ అని సమాధానమిచ్చి ఆఫీసర్లు జారుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయితేనే కొనుగోలు చేసిన ఇంటిపై యజమానికి పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తికాక ఇండ్ల కొనుగోలుదారులు బ్యాంకు లోన్లు పొందలేకపోతున్నారు. కరెంట్ మీటర్లు, నల్లా కనెక్షన్లు వారి పేర్లపై కావడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ నుంచి దాదాపు 6 వేల మంది ఇందుకోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ ముందు ఆయా కారణాలతో మండలానికి కనీసం 40 చొప్పున మ్యుటేషన్లు నిలిచిపోయాయి.
రోజుకు యావరేజ్గా 50 ఇండ్ల రిజిస్ట్రేషన్
నిజామాబాద్ అర్బన్, రూరల్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రతీరోజు సగటున150 రిజిస్ట్రేషన్లు అవుతాయి. బోధన్, ఆర్మూర్, భీంగల్లో 40 చొప్పున కలిపి జిల్లాలో రోజు 270 దాకా రిజిస్ట్రేషన్లు జరుతున్నాయి. పట్టణ ప్రాంతాల ఇండ్లను మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 50 ఇండ్లు క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇలా గడిచిన నాలుగు నెలల్లో సుమారు 6 వేల ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మండల కేంద్రాలు, అందులోనూ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మండలాల్లో క్రయవిక్రయాలు అధికంగా ఉంటాయి. డిచ్పల్లి, ఇందల్వాయి, భీంగల్, వేల్పూర్, వర్ని, మోస్రా, చందూర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా ఉంటుంది.
ఇండ్లుకొన్న వారు పూర్తి ఓనర్లు ఐతలేరు
ఇంటిని కొనుగోలు చేసిన కొత్త ఓనర్ పేరును పంచాయతీ, మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయడమే మ్యుటేషన్. ఇంటి పన్ను, నీటి పన్ను తదితర వాటికి ఆయనే బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా రికార్డుల్లో పాత ఓనర్ వివరాల స్థానంలో కొత్త యజమాని వివరాలు నమోదు చేస్తారు. కరెంట్మీటర్ పేరు మారాలన్నా మ్యుటేషన్ తప్పనిసరి. హౌస్లోన్ ఇచ్చే బ్యాంకర్ సైతం దీన్ని ప్రయారిటీగా తీసుకుంటారు. ఆన్లైన్లో పాత ఓనర్పేరు ఉన్నందున లోన్లు ఇవ్వడం లేదు.
ఎక్కడా పట్టింపులేదు
ఏప్రిల్ మొదట్లో సమస్య షురూ కాగా ఆ నెలాఖరున పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు వెళ్లారు. సమ్మె ముగిసిన తర్వాత ఆన్లైన్ను గవర్నమెంట్ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. దీని ఫలితం జిల్లాలో 6 వేల మ్యుటేషన్లపై ఉంది. అంతకు ముందు ప్రాసెసింగ్ దశలో ఉన్న మ్యుటేషన్లు 1,200 ఉన్నాయి.
మున్సిపల్ చట్టం మార్చిన సమయంలోనే..
స్టేట్లో 2020లో కొత్త మున్సిపల్ చట్టం తెచ్చారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ విధానంలోనూ విధానపరమైన మార్పులు చేశారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ బాధ్యతను రెవెన్యూ శాఖకు మార్చి, ఇండ్లు, ఇంటి జాగాల (ప్లాట్స్) రిజిస్ట్రేషన్లను సబ్రిజిస్ట్రార్లకు అప్పగించారు. వీటి రిజిస్ట్రేషన్లు చేసేప్పుడు ఆన్లైన్ మ్యుటేషన్లు కూడా చేయాలని సూచించారు. స్టాంప్ డ్యూటీకి అదనంగా గ్రామాల్లో రూ.800, మున్సిపాలిటీల్లో రూ.3 వేల మ్యుటేషన్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ–పంచాయతీలోనే మ్యుటేషన్లు
రిజిస్ర్టేషన్ ఆఫీస్ నుంచి ఆన్లైన్లో వెళ్లే సమాచారం ఆధారంగా ఈ–పంచాయతీలో మ్యుటేషన్లు జరుగుతాయి. టెక్నికల్ ప్రాబ్లమ్ఉన్నప్పుడు ఏం చేయలేం.
– జయసుధ, డీపీవో, నిజామాబాద్