బావా బామ్మర్దులు వేలకోట్లు దోచుకున్రు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

బావా బామ్మర్దులు వేలకోట్లు దోచుకున్రు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
  • హరీశ్ రావు,​ కేటీఆర్ పై  మైనంపల్లి ఫైర్​

మెదక్, వెలుగు: బావాబామ్మర్దులు అక్రమంగా ఇసుక అమ్ముకుని వేలకోట్లు దోచుకున్నారని కాంగ్రెస్​రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​ఆరోపించారు. మెదక్ పట్టణానికి చెందిన మెదక్ సొసైటీ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్​చింతల నర్సింలు, మున్సిపల్​ మాజీ వైస్​చైర్మన్​ఉప్పల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్​ మాడిశెట్టి అంజయ్య తమ అనుచరులతో ఆదివారం కాంగ్రెస్​పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా మాయా గార్డెన్​నుంచి వెంకటేశ్వర గార్డెన్​ వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీశ్​రావు​హవేలీ ఘనపూర్​ మండలం సర్ధన వద్ద మంజీరా నది నుంచి, కొల్చారం మండలం కొంగోడ్​ వద్ద హల్దీ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన బావ మరిది కేటీఆర్​ సిరిసిల్ల జిల్లాలో నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలించి అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. 

హరీశ్​ మెదక్ వచ్చి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పడాన్ని హన్మంతరావు తీవ్రంగా ఖండించారు. మెదక్​నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలను సిద్దిపేట తరలించారని, వాటన్నింటిని మళ్లీ మెదక్​ తీసుకొస్తేనే ఆయనకు గౌరవిస్తామని లేదంటే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. హరీశ్ రావు​వెంట ఉన్న ఒకాయన సొసైటీని దోచుకున్నారని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి భర్త దేవేందర్​ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సీనియర్లకు పోటీ చేసే అవకాశం దొరక్క పోతే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్, యూత్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పరుశరాంగౌడ్, మున్సిపల్​ మాజీ చైర్మన్​ చంద్రపాల్, టౌన్​పార్టీ  ప్రెసిడెంట్​గంగాధర్, బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​హఫీజొద్దీన్​, నాయకులు బాలకృష్ణ, మధుసూదన్​ రావు, అశోక్, వెంకటరమణ, పవన్, రాజేశ్​ పాల్గొన్నారు.