బడికి వెళ్లే పిల్లలకు రోజూ కొంత పాకెట్మనీ ఇస్తుంటారు తల్లిదండ్రులు. ఆ డబ్బుని పిల్లలు ఏరోజుకారోజు ఖర్చుపెడుతుంటారు. అలాకాకుండా ఆ డబ్బుని పొదుపు చేయడం పిల్లలకు నేర్పించాలి అనుకున్నారు ఈ టీచర్లు. ఆటపాటలతో పాటు పిల్లల అందమైన జీవితానికి దారి వేయాలనే ఆలోచనతో స్కూల్లోనే ఒక బ్యాంక్ ఏర్పాటు చేశారు. మైసూరు జిల్లాలోని ముల్లూర్లో ఉన్న ఈ బ్యాంక్ పేరు ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్ ముల్లూర్’. పిల్లలు నడిపిస్తున్న ఈ బ్యాంక్ విశేషాలివి...
చిన్న వయసు నుంచే డబ్బులు పొదుపు చేయడం నేర్పించాలని ఈ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్కూల్ టీచర్లు. ఈ లోయర్ ప్రైమరీ స్కూల్లో 37 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రతి స్టూడెంట్కు అకౌంట్ నెంబర్ ఉంటుంది. పిల్లల పేరు, వాళ్ల అకౌంట్ నెంబర్ రాసి ఉన్న బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఉదాహరణకు.. వంద రూపాయలు డిపాజిట్ చేస్తే పెన్సిల్, రెండొందలు చేస్తే పెన్ను, మూడొందలు జమ చేస్తే నోట్ బుక్ బహుమతిగా ఇస్తారు. ఐదొందల రూపాయలు డిపాజిట్ చేసినవాళ్లకు ఐదు శాతం వడ్డీ వస్తుంది. అకౌంట్లో వెయ్యి రూపాయల వరకు జమ అవ్వగానే వాళ్ల ఆన్లైన్ అకౌంట్కి ఆ డబ్బుని పంపిస్తారు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే విత్డ్రాయల్ చలాన్ నింపాలి. అచ్చం బ్యాంక్లో జరిగినట్టే ఈ స్కూల్ బ్యాంక్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఇక్కడి పిల్లలు.
ప్రతి ఒక్కరికీ లాకర్
‘‘బ్యాంకులలో ఉన్నట్టే మా స్కూల్ బ్యాంక్లో డబ్బులు దాచుకునే ప్రతి స్టూడెంట్కి ఒక లాకర్ ఉంటుంది. చేతితో తయారుచేసిన పాస్బుక్, చెక్ బుక్ ఇస్తాం. బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్గా రోజూ కొందరు పిల్లలకు బ్యాంక్ పని అప్పగిస్తాం” అని వివరించాడు సతీష్ అనే టీచర్.
చిన్న చిన్న ఖర్చులకి...
‘‘ఇంతకుమందు పాకెట్ మనీ మొత్తం జంక్ఫుడ్ తినేందుకు ఖర్చుచేసేవాడిని. కానీ, ఇప్పుడు అలా చేయడం లేదు. అమ్మానాన్న ఇచ్చిన డబ్బుని మా స్కూల్ బ్యాంక్లో దాచుకుంటున్నా. నోట్స్, ఎగ్జామ్ ప్యాడ్.. ఇలా చిన్న చిన్న ఖర్చులకి ఆ డబ్బుని వాడుతున్నా” అని చెప్పాడు ఐదో క్లాస్ చదువుతున్న శరద్ నవ్య అనే స్టూడెంట్.