- నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు : నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ రైతులకు సూచించారు. నల్గొండ సమీపంలోని ఆర్జలబావి వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్లో ప్రభుత్వం గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 401 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి 124 రైస్ మిల్లులను అనుసంధానించామని వివరించారు. కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
