పెద్దపల్లి ఎంపీగా వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : నల్లాల ఓదెలు

పెద్దపల్లి ఎంపీగా  వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : నల్లాల ఓదెలు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే​ నల్లాల ఓదెలు తెలిపారు. సోమవారం మందమర్రిలోని తన నివాసంలో మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, స్టేట్​లీడర్ దుర్గం నరేశ్​తో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధే వంశీని గెలిపిస్తుందన్నారు.

ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వంశీ ప్రణాళికలు రూపొందించారన్నారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, కాకా కుటుంబంపై మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ తప్పుడు విమర్శలు చేస్తున్నారని,  ఆయన తీరు మార్చుకోకపోతే ఊరుకోబోమని నల్లాల ఓదెలు హెచ్చరించారు. వంశీ గెలుపు ఖాయం కావడంతో  బీజేపీ లీడర్లు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్​ లీడర్లు గుడ్ల రమేశ్, మాజీ సర్పంచులు కోమురయ్య, కమల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆ పార్టీ పార్లమెంట్​నియోజకవర్గ ఇన్ చార్జి, ఓబీసీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్ తెలిపారు. పార్లమెంట్ ఇన్​చార్జిగా నియమితులైన ప్రభాకర్​ను మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ..  వంశీ అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ కాకా వెంకటస్వామి కలలను నెరవేరుస్తున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాములు నాయక్, కొమ్ముల సురేశ్, నీలి కృష్ణ, మాటూరు మధు, పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.