![షెఫాలి వర్మ టాలెంట్ అద్భుతం : మోడీ](https://static.v6velugu.com/uploads/2023/01/Shefali-Verma_sy3m1RfHK8.jpg)
మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కరింపించారు. ఉత్తర్ప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో జరుగుతున్న ‘సాన్సద్ ఖేల్ మహాకుంభ్’ రెండో దశను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా అండర్19 మహిళా టీ20 ప్రపంచకప్లో రాణిస్తున్న షెఫాలీ వర్మను ప్రధాని మోడీ కొనియాడారు. తనలాంటి ప్రతిభ భారతదేశంలోని చాలామందిలోనూ ఉంటుందని, వాళ్లను గుర్తించి వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
ప్రపంచకప్లో షెఫాలీ వర్మ భారత జట్టుకు సారథ్యం వహిస్తూ.. సమర్థంగా జట్టును ముందుకు నడిపిస్తోంది. గ్రూప్ డీలో ఉన్న టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడితే.. రెండిట్లోనూ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచుల్లో షెఫాలీ 61.50 సగటుతో 123 పరుగులు చేసింది. అందులో ఒక హాఫ్ సెంచరీ (78) కూడా ఉంది.