చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను కనిపెట్టిన నాసా

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను కనిపెట్టిన నాసా

చంద్రుడి దక్షిణ ధ్రువంలో కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపితే, అది కుప్పకూలింది. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటంతో ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెలుగు రావడంతో ల్యాండర్ జాడను కనిపెట్టింది. దానికి సంబంధించిన  ఫోటోలను విడుదల చేసింది.

సెప్టెంబర్ 26న ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ల్యాండర్‌ ను గుర్తించిందని నాసా తెలిపింది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని చెప్పింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయంది.

షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి మొదటి శకలాన్ని గుర్తించినట్లు నాసా తెలిపింది. విక్రమ్ లాండర్ కూలిన ప్రదేశానికి మరో 750 మీటర్ల పరిధిలో శకలాన్ని గుర్తించినట్లు చెప్పింది. నాసా విడుదల చేసిన చిత్రాల్లో ఆకుపచ్చ రంగులో ఉన్న గుర్తులు విక్రమ్ శకలాలను సూచిస్తున్నాయి. విక్రమ్ పడకముందు, కూలిన తర్వాత చంద్రుడి ఉపరితలానికి చెందిన చిత్రాలు కూడా నాసా విడుదల చేసింది.

జులైలో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ -2 ప్రయోగాన్ని చేపట్టింది. చైనా, అగ్రరాజ్యం అమెరికా, రష్యా తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ పంపిన దేశం భారత్.