
విక్రమ్లో ఎలాంటి చలనం లేకపోయినా ఇస్రో పలకరిస్తూనే ఉంది. ఎప్పుడో అప్పుడు అది స్పందించకపోతుందా అన్న చిన్న ఆశ. ఒక్క మన ఇస్రోనే కాదు, విక్రమ్ పలకాలని దేశం మొత్తం కోరుకుంటోంది. అయినా అది మాట వినదే. ఇప్పుడు నాసా కూడా మన విక్రమ్ను కదిలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదేపనిగా హలో మెసేజ్లు పంపుతోంది. ‘హలో విక్రమ్.. దిస్ ఈజ్ నాసా’ అంటూ మెసేజ్లు చేరవేస్తోంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు చెందిన డీప్ స్పేస్ నెట్వర్క్(డీఎస్ఎన్) గ్రౌండ్ స్టేషన్స్ నుంచి జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) విక్రమ్కు రేడియో ఫ్రీక్వెన్సీలను పంపుతోంది. ఈ విషయాన్ని నాసా వర్గాలే స్వయంగా వెల్లడించాయి. ‘‘అవును, నాసా, జేపీఎల్లు విక్రమ్తో లింక్ కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. డీఎస్ఎన్ల నుంచి సిగ్నళ్లను పంపుతున్నాయి. ఇప్పటికే దీనిపై ఇస్రోతో ఒప్పందమూ ఉంది” అని నాసా అధికారి ఒకరు చెప్పారు.
కాలిఫోర్నియాలోని డీఎస్ఎన్ నుంచి విక్రమ్కు రేడియో తరంగాలు పంపామని నాసా సైంటిస్ట్ స్కాట్ టిల్లీ చెప్పారు. 2005లో నాసా గూఢచర్య ఉపగ్రహం ఇమేజ్తో లింక్ తెగిపోయినప్పుడు అదెక్కడుందో కనిపెట్టింది ఆయనే. ఇప్పుడు విక్రమ్పై ఆయన స్పందించారు. ‘‘విక్రమ్ నుంచి సిగ్నళ్లను రాబట్టేందుకు డీఎస్ఎన్ 24, 12 కిలోవాట్ల రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపుతోంది. విక్రమ్ను తిరిగి లైన్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎర్త్ మూన్ ఎర్త్ (ఈఎంఈ) నుంచి 2013లో సెర్చర్ సిగ్నళ్లు చంద్రుడికి, అక్కడి నుంచి భూమికి వచ్చాయి. అది రికార్డయింది కూడా” అని టిల్లీ ట్వీట్ చేశారు. ఆ రికార్డింగ్ను ట్వీట్లో పోస్ట్ చేశారు. డీఎస్ఎన్ 24 నుంచి రెండు రోజులుగా సిగ్నళ్లు పంపుతున్నామని, ఇతర డీఎస్ఎన్లూ అదే పనిలో ఉండి ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న గోల్డ్స్టోన్, స్పెయిన్లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాల్లో నాసా డీఎస్ఎన్ స్టేషన్లున్నాయి. ఈ మూడు స్టేషన్లను 120 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్కు నాలుగు పెద్ద పెద్ద యాంటెన్నాలుంటాయి. 26 మీటర్ల నుంచి 70 మీటర్ల వ్యాసంతో అవి ఉంటాయి. అవన్నీ కూడా ఒకేసారి అంతరిక్షంలోని శాటిలైట్లకు సిగ్నళ్లను చేరవేస్తాయి.
అందుకే నాసాకు ఆసక్తి
విక్రమ్పై నాసా ఇంత ఆసక్తి కనబరచడానికి కారణం లేకపోలేదు. అందులో మొదటిది విక్రమ్లో ఏర్పాటు చేసిన పాసివ్ పేలోడ్ లేజర్ రిఫ్లెక్టర్ అర్రే. ఈ పాసివ్ పేలోడ్తో విక్రమ్ ఎక్కడుందన్నది తెలుసుకోవచ్చు. అంతేగాకుండా భూమి–చంద్రుడి మధ్య దూరం ఎంతుందో కచ్చితంగా లెక్కించొచ్చు. రెండింటి మధ్య దూరం ఎంతుందో తెలిస్తే భవిష్యత్ ప్రయోగాలు మరింత సులభం అవుతాయి. ఈ పేలోడ్ను నాసానే తయారు చేసింది. 2024లో నాసా ఆర్టిమిస్ ప్రయోగం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అవడంతో నాసా పేలోడ్పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అందుకే నాసా విక్రమ్ను కదిలించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకో కారణం, చంద్రయాన్ 2 ఆర్బిటర్లో 8 అత్యాధునిక పేలోడ్లున్నాయి. అవి చంద్రుడి గోళం మొత్తాన్ని ఫొటో తీసేయగలవు. కాబట్టి ఆర్బిటర్ పంపించే చందమామ దక్షిణ ధ్రువం త్రీడీ ఫొటోల కోసం నాసా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆర్టిమిస్ మిషన్కు ఆ ఫొటోలూ కీలకం కానున్నాయి. ఎందుకంటే ఆ మిషన్లోనూ చందమామ దక్షిణ ధ్రువంపైకి నాసా ఆస్ట్రోనాట్లను పంపిస్తోంది మరి.
తర్వాతి ప్రయోగాలపై దృష్టి పెట్టండి
ప్రస్తుతం విక్రమ్ హార్డ్ ల్యాండింగ్పై ఇస్రోలోని ఇంటర్నల్ ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ (ఎఫ్ఏసీ) విశ్లేషిస్తోంది. దీనిపై సోమవారం ఇస్రో చైర్మన్ సైంటిస్టులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. విక్రమ్ హార్డ్ల్యాండింగ్పై ఆందోళన చెందొద్దని సైంటిస్టులకు ఆయన చెప్పినట్టు సమాచారం. తర్వాత చేయబోయే ప్రయోగాలపైనే దృష్టి పెట్టాలని సూచించారని ఇస్రో అధికారి ఒకరు చెబుతున్నారు. బైలాలులోని ఇస్రో డీఎస్ఎన్కు చెందిన 32 మీటర్ల యాంటెన్నాతో విక్రమ్ను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, నాసా జేపీఎల్ కూడా సహకరిస్తోందని ఇస్రో సైంటిస్ట్ ఒకరు చెప్పారు. యాంటెన్నాలు సరైన దిశలోనే ఉన్నాయని, కాంటాక్ట్ కావడానికి విక్రమ్కు కరెంట్ అవసరమని మరో సైంటిస్ట్ చెప్పారు.
ఇస్రోకు అతిథులొచ్చారు
చంద్రయాన్2 ప్రయోగం తర్వాత ఇస్రోకు నాసా, కాల్టెక్ (కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి చెందిన అతిథులు వచ్చారు. కాల్టెక్ ప్రొఫెసర్ డేవిడ్ టిరెల్తో పాటు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మంత్రి, జేపీఎల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లారీ జేమ్స్ వచ్చారని ఇస్రో తెలిపింది. బుధవారం వాళ్లు బెంగళూరులోని ఇస్రో ఆఫీసుకు వచ్చారని వెల్లడించింది. కాల్టెక్ సీనియర్ అధికారులూ వచ్చారని చెప్పింది. అయితే, వాళ్లు ఎందుకు వచ్చారన్న విషయం మాత్రం ఇస్రో చెప్పలేదు.