కామారెడ్డిలో అట్టహాసంగా జాతీయ కబడ్డీ పోటీలు

కామారెడ్డిలో అట్టహాసంగా జాతీయ కబడ్డీ పోటీలు
  •     జార్ఖండ్, కేరళ మధ్య తొలి మ్యాచ్​​
  •     క్రీడలతో దేశానికి మంచి పేరు తేవాలి – ఎమ్మెల్యే రమణారెడ్డి
  •     స్పోర్ట్స్​తో స్నేహభావం పెరుగుతుంది – కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: జాతీయ స్థాయి అండర్​– 17 బాలుర కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి కామారెడ్డిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్​ గేమ్స్​ ఫేడరేషన్​(ఎస్​జీఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో పోటీలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్​ పోటీలను ప్రారంభించారు.

కేరళ, జార్ఖండ్​ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్​జరిగింది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు ప్రపంచ దేశాల్లో మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. అన్నీ ప్రభుత్వాలు క్రీడారంగానికి పెద్ద పీట వేయాల్సిన అవసరముందన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు పొంగిపోకూడదని, ఓడిన వాళ్లు అధైర్యపడకుండా మరోసారి విజయం కోసం సాధన చేయాలన్నారు. జాతీయ స్థాయి పోటీలకు కామారెడ్డి వేదిక కావడం ఆనందదాయకమన్నారు.

కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్​ మాట్లాడుతూ... క్రీడలు అందరినీ ఒక చోటకు చేర్చడమే కాకుండా స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఇక్కడి సంస్కృతిని తమ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వారికి చెప్పాలని కలెక్టర్ ​క్రీడాకారులను కోరారు. డీఈవో రాజు, యూత్​వెల్ఫేర్​ఆఫీసర్ ​దామోదర్​రెడ్డి, ఎస్​జీఎఫ్​ స్టేట్​సెక్రెటరీ రామ్​రెడ్డి, దాతలు పైడి ఎల్లారెడ్డి, వేణుగోపాల్​రెడ్డి, ఎస్​జీఎఫ్​జిల్లా సెక్రెటరీ రసూల్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పీఈటీలు పాల్గొన్నారు.