చక్కెర ధరల భగభగ: మోడీ సర్కార్ E20 విధానమే కారణంటూ జైరామ్ రమేష్, కేజ్రీవాల్ ఫైర్

చక్కెర ధరల భగభగ: మోడీ సర్కార్ E20 విధానమే కారణంటూ జైరామ్ రమేష్, కేజ్రీవాల్ ఫైర్

దేశంలో చెరుకును ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్ల చక్కెర సంక్షోభం తలెత్తింది. దేశంలో తగినంత చెరుకు దిగుబడి ఉన్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి వెనుక పడటంతో దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గి ధరలు రికార్డు స్థాయికి తగ్గాయి. పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ ధరల నియంత్రణ కోసం చక్కెర దిగుమతుల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. దేశీయంగా రేట్ల పెరుగుదలను అదుపుచేసేందుకు 100 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఇది మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏర్పడిన పరిస్థితి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ విమర్శలు..
20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్రూడ్ దిగుమతుల బిల్ తగ్గిస్తామంటూ మోడీ సర్కార్ అవలంబిస్తున్న విధానం వల్ల సామాన్యులపై ఆహార పదార్థాలు, ప్రయాణ ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. చెరుకు, ధాన్యాలను ఇథనాల్ కోసం మళ్లించడం వల్ల మార్కెట్లో వాటి కొరత ఏర్పడి చక్కెర ధరలు కిలో రూ.48 నుంచి రూ.67కి, బెల్లం ధర రూ.50 నుంచి రూ.65కి పెరిగిందని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా ఖర్చులు తగ్గినా పెట్రోల్ ధరలను ఎందుకు తగ్గించలేదని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

అరవింద్ కేజ్రీవాల్..
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ విధానాన్ని తప్పుబట్టారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి చెరుకు నుంచి ఇథనాల్ తయారు చేయాలని చూసి.. ఇప్పుడు దేశీయంగా చక్కెర కొరత సృష్టించి మళ్లీ విదేశాల నుంచే చక్కెర దిగుమతి చేసుకునే స్థితికి వచ్చారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. E20 విధానాన్ని ప్రశ్నించే వారి గొంతును అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ALSO READ : డిజిటల్ ఇండియా కోసం ఎయిర్‌టెల్ సావరిన్ క్లౌడ్.. 

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందన..
ఇదే క్రమంలో వాహనాల మైలేజీ తగ్గిపోవడానికి కేవలం E20 పెట్రోల్ మాత్రమే కారణం కాదని కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రైవింగ్ అలవాట్లు, ట్రాఫిక్ పరిస్థితులు, వాహనాల నిర్వహణ, టైర్లలో గాలి పీడనం, ఏసీ వాడకం వంటి అంశాలు కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపింది. విస్తృతమైన పరీక్షల తర్వాతే E20 విధానాన్ని తెచ్చామన్నారు. 

జనం మదిలోని మాట.. 
మెుత్తానికి ఇథనాల్ కలిపి నాలుగు డాలర్లు మిగులుస్తాం అంటూ మోడీ సర్కార్ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే E20 పెట్రోల్ కారణంగా వాహనాలకు రిపేర్లు పెరిగి జేబులకు చిల్లుపడుతోంటే.. అదే ఇథనాల్ కారణంగా ఆహార పదార్థాల కొరత, రేట్లు పెరుగుల రావటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకపక్క ఉద్యోగాలు పోతూ రేట్లు పెరుగుతూ ఖర్చుల భారంతో సతమతం అవుతున్నామని వాపోతున్నారు జనం. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పటికీ ఇథనాల్ మిక్సింగ్ ఆపకపోవటం.. చక్కర లేక అదే డాలర్లు పెట్టి విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవటం ఏంటని, దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఎక్కడ సేవ్ అవుతున్నాయ్ అంటూ ప్రశ్నిస్తున్నారు జనం. క్రూడ్ ఆయిల్ కంటే ఆహారపదార్థాల ధరలే ఎక్కువగా ఉండటంతో ఫారెక్స్ ఖర్చులు తగ్గకపోగా పెరుగుతున్నాయ్ మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.