ఈశాన్యం రాష్ట్రం మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫఘు చౌహాన్ సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కన్రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు.
11 మంది మంత్రులుగా ప్రమాణం..
సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్పిపికి చెందిన ప్రిస్టోన్ టైన్సాంగ్, స్నియావ్భలాంగ్ ధర్లు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి అలెగ్జాండర్ లాలూ హెక్, యూడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్ఎస్పిడిపికి చెందిన షక్లియార్ వార్జ్రీ మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తంఎన్పీపీ నుంచి ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, HSPDP నుంచి ఒక ఎమ్మెల్యే సంగ్మా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.
మేఘాలయ 2.0..
మేఘాలయలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నేషనల్ పీపుల్స్ పార్టీ, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ , బీజేపీ , హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఇండిపెండెంట్లతో కలిసి ఎన్పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ 2.0’ గా నామకరణం చేశారు. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో కూటమి సభ్యుల బలం 45గా ఉంది.
ఎన్పీపీ విజయం..
మేఘాలయలో మొత్తం 60స్థానాలుకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్పీపీ 26 స్థానాలను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 5 సీట్లతో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్కు 5 సీట్లు వచ్చాయి. అటు బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు దక్కాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.