
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఏడాదికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంగా నేషనల్ టెలికాం పాలసీ--2025 (ఎన్టీపీ-25) ను కేంద్ర ప్రభుత్వం రెడీ చేస్తోంది.
5జీ, 6జీ, ఏఐ, ఐఓటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ వంటి ఎమెర్జింగ్ టెక్నాలజీలలో ఇన్నోవేషన్స్ పెంచడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) లో ప్రపంచంలోని టాప్ 10 హబ్లలో ఒకటిగా నిలిపేందుకు ఈ పాలసీ సాయపడుతుందని అంచనా వేస్తోంది. ఈ పాలసీపై 21 రోజుల్లో ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ప్రజలను టెలికాం శాఖ కోరింది.
భారత్ను డిజిటల్ టెక్నాలజీల వినియోగదారుగానే కాకుండా, టెలికాం ఉత్పత్తులు, సేవలు, సొల్యూషన్లను సప్లయ్ చేసే గ్లోబల్ సరఫరాదారుగా మార్చడం ఈ పాలసీ లక్ష్యం. ఇది భారత్ను టెలికాం ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్గా నిలపడంలో సాయపడుతుంది. అంతేకాకుండా ఈ పాలసీతో రీసెర్చ్లో పెట్టుబడులు పెరుగుతాయని, వర్క్ఫోర్స్ స్కిల్స్ అప్గ్రేడ్ అవుతాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇండస్ట్రీ 4.0, గ్రామీణ బ్రాడ్బ్యాండ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, డిజిటల్ గవర్నెన్స్ వంటి వాటికి మద్దతు ఇస్తుందని తెలిపింది. టెలికం ఉత్పత్తులు, సేవల ఎగుమతులను రెట్టింపు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. టెలికం స్టార్టప్ల సంఖ్య, ఎమెర్జింగ్ టెక్నాలజీలపై ఆర్ అండ్ డీ ఖర్చును రెట్టింపు చేయాలని చూస్తోంది. 2030 నాటికి గ్లోబల్గా 6జీ సంబంధిత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో 10శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం సావరిన్ పేటెంట్ ఫండ్ను ఏర్పాటు చేయనుంది.