ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతం

ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతం

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతం అయ్యారు. బస్తర్​ఐజీ సుందర్​రాజ్​పి, కాంకేర్​ఎస్పీ శలభ్​సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. కాంకేర్ జిల్లా సిక్​సోడ్​పీఎస్​పరిధిలోని మోటాబోదేలీ కడ్మే అడవుల్లో మావోయిస్టు పరతాప్​పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి దర్శన్​పడ్డా తిరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఎస్పీ శలభ్​సిన్హా.. డీఆర్ జీ, బీఎస్ఎఫ్ తో కలిపి ఒక టీంను ఏర్పాటు చేశారు. బలగాలు ఆదివారం రాత్రి మోటాబోదేలీ అడవుల్లోకి వెళ్లగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.

దాదాపు గంట సేపు హోరాహోరీగా కాల్పులు కొనసాగగా మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఒకరు పరతాప్​పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి దర్శన్​పడ్డా, స్మాల్​యాక్షన్​టీం కమాండర్​జాగేశ్​సలాంగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు కొన్నాళ్లుగా బస్తర్ దండకారణ్యంలో పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దర్శన్​పడ్డాపై చార్​గావ్ ఉపసర్పంచ్ హత్య, అక్కడి మైన్​లో వాహనాలను దహనం చేసిన ఘటనతోపాటు 40కి పైగా కేసులు ఉన్నాయి. 315గన్, 8ఎంఎం పిస్టల్, బుల్లెట్లు, మందుపాతరలు దొరికాయి.