షిప్‌లో రేవ్ పార్టీ.. ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

షిప్‌లో రేవ్ పార్టీ..  ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

బాలీవుడ్‌ను డ్రగ్స్ అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా శనివారం రాత్రి ఎన్‌సీబీ అధికారులు జరిపిన దాడుల్లో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరో కొడుకు కూడా డ్రగ్స్ తీసుకుంటూ దొరికినట్లు సమాచారం. ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దాంతో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడె ఓ ప్రయాణికుడిగా షిప్‌లో ఎక్కాడు. షిప్‌లోకి ఎక్కాలంటే ఎంట్రీ ఫీజు రూ. 80 వేల రూపాయలు. ముంబై తీరం నుంచి బయలుదేరిన షిప్.. సముద్రం మధ్యలోకి చేరుకోగానే రేవ్ పార్టీ మొదలైంది. అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా దాడులు నిర్వహించారు. దాదాపు ఏడు గంటల పాటు నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత క్రూయిజ్ షిప్‌ను ముంబై అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌కు తీసుకొచ్చారు. పట్టుబడిన వారందరినీ ఎన్‌సీబీ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేసే అవకాశాలున్నాయి. గత సంవత్సరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ  కేసుకు సంబంధించి రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు నటీనటులను ఎన్‌సీబీ విచారించింది.