- బైజూస్కు ఎన్సీపీసీఆర్ సమన్లు
- అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు
న్యూఢిల్లీ: విద్యార్థులను కోర్సుల్లో చేర్పించడానికి బెంగళూరు ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ సేల్స్టీమ్ అక్రమాలకు/వేధింపులకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఆరోపణలపై జవాబు చెప్పాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సంస్థ సీఈఓ రవీంద్రన్కు సమన్లు పంపించింది "మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు" తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో చెప్పారు. ఈ ఆన్లైన్ ట్యూటర్ వల్ల తాము దోపిడీకి గురయ్యామని, మోసపోయామని, తమ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తల్లిదండ్రులు ఆరోపించినట్టు సమన్లలో ఎన్సీపీసీఆర్ పేర్కొంది.
ఈ ఆరోపణలపై స్పందించేందుకు డిసెంబర్ 23న హాజరు కావాలని రవీంద్రన్ను కమిషన్ కోరింది. బైజూస్ కోర్సుల వివరాలు, ఫీజు వివరాలు, కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య, రీఫండ్ పాలసీ, బైజూను చట్టబద్ధ ఎడ్టెక్ కంపెనీగా గుర్తించే చట్టపరమైన పత్రాలు, ఇతర పత్రాలను అందించాలని కూడా సూచించింది. బైజూస్పై ఇట్లాంటి ఫిర్యాదులు ఇంతకు ముందు కూడా వచ్చాయని, వీటిపై తాము విద్యామంత్రిత్వ శాఖకు లెటర్ రాయడంతో, మార్గదర్శకాలను విడుదల చేసిందని కానూంగో చెప్పారు.
బైజూస్ కోర్సులు, ఎడ్యుకేషన్ లోన్లపై సేల్స్పర్సన్స్ బలవంతంగా తల్లిదండ్రులతో సంతకాలు తీసుకున్నట్టు తమకు కంప్లైంట్స్ అందాయని చెప్పారు. ఈ విషయంపై స్పందన కోసం చేసిన అభ్యర్థనకు బైజూస్ ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.