న్యూఢిల్లీ: ఓపెన్ ఆఫర్ ధర కంటే ఎక్కువకే ఎన్డీటీవీ షేర్లు ట్రేడవుతున్నప్పటికీ, అదానీ గ్రూప్ ప్రకటించిన పబ్లిక్ ఆఫర్ ఇన్వెస్టర్లను పెద్ద మొత్తంలో ఆకర్షించగలిగింది. ఓపెన్ ఆఫర్ ద్వారా 1.67 కోట్లు లేదా 26 శాతం వాటాను ఎన్డీటీవీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయాలని అదానీ గ్రూప్ టార్గెట్గా పెట్టుకుంది. 53 లక్షల షేర్లను అమ్మేందుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. ఇది ఓపెన్ ఆఫర్లో 32 శాతానికి సమానం. ఈ పబ్లిక్ ఆఫర్లో షేరుకి రూ.294 ఇవ్వనుండగా, కంపెనీ షేరు శుక్రవారం రూ. 415 వద్ద ముగిసింది. ఈ ఆఫర్ సోమవారంతో ముగుస్తుంది. ఎన్ఎస్ఈ విడుదల చేసిన డేటా ప్రకారం, కార్పొరేట్ ఇన్వెస్టర్లు రూ. 39.34 లక్షల షేర్లను, రిటైల్ ఇన్వెస్టర్లు 7 లక్షల షేర్లను, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 6.86 లక్షల షేర్లను అమ్మేందుకు టెండర్లు వేశారు. ఓపెన్ ఆఫర్ కింద వచ్చినషేర్ల వాటా ఎన్డీటీవీలో 8.26 శాతానికి సమానం. ఇప్పటికే ఈ మీడియా హౌస్లో 29.18 శాతం వాటాను విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ (వీసీపీఎల్) ను కొనడం ద్వారా అదానీ గ్రూప్ దక్కించుకుంది.
తాజాగా వచ్చిన టెండర్ షేర్లను కూడా కలుపుకుంటే ఈ వాటా 37.44 శాతానికి పెరుగుతుంది. ఇది కంపెనీ ప్రమోటర్లు అయిన ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ల మొత్తం వాటా 32.26 శాతం కంటే ఎక్కువ. అదానీ గ్రూప్ టేకోవర్ చేయకముందు ఎన్డీటీవీలో ప్రమోటర్లకు 61.45 శాతం వాటా ఉంది. ఇందులో ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్కు చెందిన 29.18 శాతం వాటా కలిసి ఉంది. కాగా, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ లిమిటెడ్ వీసీపీఎల్ నుంచి రూ.403 కోట్లను వడ్డీ లేకుండా అప్పుగా తీసుకుంది. ఈ అప్పును వీసీపీఎల్ ఎన్డీటీవీలోని వాటాలు కింద మార్పుకుంది. అదానీ గ్రూప్ వీసీపీఎల్ మొత్తాన్ని కొనుగోలు చేసి ఎన్డీటీవీలో వాటాలను దక్కించుకుంది. ఎన్డీటీవీని ఇంటర్నేషనల్ మీడియాగా తయారు చేస్తామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గతంలో పేర్కొన్నారు. చైర్మన్గా కొనసాగమని ప్రణయ్ రాయ్ను అడిగామని అన్నారు. ఆయన ఒప్పుకోకపోయినా కొత్త చైర్మన్ నియమించుకునే హక్కు అదానీ గ్రూప్కి ఉంది.