
- కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి
- త్వరలో బడ్జెట్ కేటాయిస్తామని హామీ
- డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని ఆదేశం
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్ నగర్–-జడ్చర్ల మధ్య ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త బై పాస్ రోడ్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రెండు వారాల కింద మహబూబ్నగర్ శివారులోని అప్పన్నపల్లి గ్రామం వద్ద ఉన్న ఆర్వోబీ నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి హైవేకు లింక్ చేస్తూ ఓ బై పాస్ ఏర్పాటుకు మంజూరు లభించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ పిలవాలని ఇటీవల కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజాగా మరో బై పాస్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ బై పాస్కు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో మరో బైపాస్ ఏర్పాటు చేసి హైవేలను అనుసంధానం చేసేలా డిజైన్ చేశారు.
కేంద్ర మంత్రి గడ్కరీకి వినతి..
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి పాలమూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. మహబూబ్నగర్–-జడ్చర్ల మధ్య బై పాస్ నిర్మించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి అందజేశారు. రెండు హైవేలను కలిపేలా ఈ ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. మహబూబ్నగర్–-జడ్చర్ల మధ్య ఎన్హెచ్-167 నక్కలబండ తండా నుంచి బండమీదిపల్లి, శంకరాయపల్లి, పోలేపల్లి మీదుగా మాచారం వద్ద ఎన్హెచ్–-44కు లింక్ చేయవచ్చని చెప్పారు. అక్కడి నుంచి గంగాపురం వరకు తీసుకెళ్లి మళ్లీ ఎన్హెచ్–-167కు కలిపేలా మ్యాప్ రూపొందించారు. దాదాపు పది కిలోమీటర్ల మేర ఈ బైపాస్ నిర్మించాల్సి ఉంటుంది.
ఇందుకు దాదాపు రూ.270 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. డీపీఆర్ చేయించాలని సూచించారని, డీపీఆర్ రాగానే బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు.
బైపాస్లు అనివార్యం..
ఈ హైవేల మీద బైపాస్ నిర్మాణం అనివార్యంగా మారింది. ఇప్పటికే భూత్పూర్,- మహబూబ్నగర్ మధ్య ఓ బై పాస్ నిర్మాణంలో ఉంది. ఈ పనులు 70 శాతం పూర్తయ్యాయి. పాలమూరు యూనివర్సిటీ వద్ద బ్రిడ్జి పనులు మిగిలి ఉన్నాయి. ఈ బైపాస్ పూర్తయితే ఎన్హెచ్–44 నుంచి బెంగళూరు, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎన్హెచ్–-167 మీదుగా పాలమూరులోకి రాకుండానే యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్లిపోతాయి. దీంతో పాత పాలమూరు, వన్టౌన్ ఏరియాలో ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. ఇటీవల అప్పన్నపల్లి ఆర్వోబీ నుంచి చిన్నదర్పల్లి మీదుగా చించోలికి(ఎన్హెచ్–167ఎన్)కు లింక్ కలిపే బైపాస్ కేంద్రం మంజూరు చేయగా, ఇది పూర్తయితే హైదరాబాద్, జడ్చర్ల, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండానే డైవర్ట్ అవుతాయి.
దీంతో టీడీగుట్ట, న్యూ టౌన్, బస్టాండ్ చౌరస్తా, పాత బస్టాండ్లో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. తాజాగా ప్రతిపాదించిన బైపాస్ సాకారమైతే కర్నాటక, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు, అలాగే మహబూబ్నగర్ నుంచి కల్వకుర్తి వెళ్లే వాహనాలను జడ్చర్ల పట్టణంలోకి రాకుండా డైవర్ట్ చేయొచ్చు. దీంతో జడ్చర్లలోని కొత్త బస్టాండ్, సిగ్నల్ గడ్డ, కల్వకుర్తి రోడ్డులో ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంది.
తీరనున్న ట్రాఫిక్ తిప్పలు..
మహబూబ్నగర్ జిల్లాలో ఎన్హెచ్–167, ఎన్హెచ్–167(ఎన్) ఉన్నాయి. ఇందులో 167 (ఎన్) జిల్లాలోని భూత్పూర్ నుంచి మొదలై మహబూబ్నగర్ మీదుగా కర్నాటక రాష్ట్రంలోని చించోలి వరకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ హైవే పనులు నడుస్తున్నాయి. ఎన్హెచ్-167 కర్నాటకలోని రాయచూరు నుంచి ప్రారంభమై మహబూబ్నగర్, జడ్చర్ల మీదుగా కోదాడ వరకు 483 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఈ రెండు హైవేలు మహబూబ్నగర్, జడ్చర్ల టౌన్ నుంచి వెళ్తున్నాయి.
దీంతో జిల్లా కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వచ్చే వారు, జడ్చర్లలోని ఆయా పరిశ్రమల్లో పనులు చేయడానికి వెళ్లే వారు, అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ లారీలు, ఆటోల రాకపోకలతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. ఈ క్రమంలో తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈక్రమంలో బైపాస్ నిర్మాణం జరిగితే ట్రాఫిక్ తిప్పలు దూరమవుతాయి.