
- ఈ వారంలోనే ప్రైవేటు కాలేజీల నుంచి డేటా సేకరణ
- ఆడిట్ చేసిన మూడేండ్ల అకౌంట్స్ వివరాల డేటా పరిశీలన
- వచ్చే మూడేండ్ల బ్లాక్ పీరియడ్కు కొత్త ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ కసరత్తు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ సహా పలు మెడికల్ కోర్సులో కొత్త ఫీజులు అమలు కానున్నాయి. ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లో రానున్న మూడేండ్ల బ్లాక్ పీరియడ్కు మెడికల్, పారామెడికల్ కోర్సుల్లో ఫీజుల నిర్ణయానికి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇటీవల సమావేశమైంది. ఈ సందర్భంగా కాలేజీల నుంచి వివరాల సేకరణకు టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషనూ రిలీజ్ చేసింది. త్వరలోనే కాలేజీల నుంచి ఆన్లైన్ ద్వారా డేటా సేకరించేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలోని ఎంబీబీఎస్, మెడికల్ పీజీ కోర్సు, డెంటల్, నర్సింగ్, ఇతర పారామెడికల్ కోర్సులకు రెండేండ్ల కింద నిర్ణయించిన ఫీజుల గడువు 2025–26తో ముగియనున్నది. దీంతో ఆ తర్వాతి 2026– 27 నుంచి 2028– 29 వరకూ మూడేండ్ల బ్లాక్ పీరియడ్కు కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును టీఏఎఫ్ఆర్సీ ప్రారంభించింది. ప్రధానంగా ఎంబీబీఎస్లో మూడు కేటగిరీల్లోని సీట్లకు ఫీజులను నిర్ధారించనున్నారు.
ఆదాయ, వ్యయాల సేకరణ..
ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు కొత్త ఫీజుల ప్రతిపాదనలతో పాటు అవసరమైన ఆన్లైన్ డేటాను టీఏఎఫ్ఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయ వ్యయాల స్టేట్మెంట్లు, ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లు, డేవలప్మెంట్ అవసర వివరాలు, సిబ్బంది జీతాలు, మౌలిక వసతుల కల్పనకు చేసిన ఖర్చులు, వాటి బిల్లులు సమర్పించాల్సిఉంది. 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ ఫైనాన్స్ రిపోర్టును అందించాల్సి ఉంటుంది.
అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని టీఏఎఫ్ఆర్సీ భావించినా.. వివిధ కారణాలతో రెండోవారం నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 30 నాటికి డేటాను అందించాల్సి ఉంది. డేటా వివరాలను http://tafrconline.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
కొత్త ఫీజులు ఈ కోర్సుల్లోనే..
ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సులు, బీడీఎస్, పీజీ డెంటల్ కోర్సులు, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి (పీజీ), బీఎన్వైఎస్, జీఎన్ఎం, ఎంపీహెచ్, డీఎంఎల్టీతో పాటు ఇతర పారామెడికల్ కోర్సుల్లో కొత్త ఫీజులు అమలు కానున్నాయి. వీటితో పాటు బీఎస్సీ నర్సింగ్ , పీబీబీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఎంపీటీ తదితర కోర్సుల్లోనూ వచ్చే ఏడాది నుంచి కొత్త ఫీజులు అమలు కానున్నాయి.