
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మారనుంది. సిగరెట్, బీడీ, పాన్ మసాలా తదితర పొగాకు ఉత్పత్తులపై ‘‘పొగాకు బాధాకరమైన చావుకు కారణమవుతుంది’’అనే కొత్త హెచ్చరికతో పాటు ఓ కొత్త ఫొటో కూడా రానుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
డిసెంబర్ 1 నుంచి పొగాకు తయారీ, దిగుమతి, ప్యాకేజీ చేసే వారు తప్పనిసరిగా ఆ ఫొటోతో పాటు హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, 2023 డిసెంబర్ 1 నుంచి ‘‘పొగాకు వాడే వారు యుక్త వయసులోనే మరణిస్తారు”అనే హెచ్చరిక అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ (ప్యాకేజింగ్, లేబిలింగ్) రూల్స్కు సవరణలు చేసింది.