ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా రెచ్చగొడుతోంది
కరోనాపై స్టడీలో కొత్త విషయాలు
న్యూఢిల్లీ: మనిషి పేగులనూ కరోనా వదలట్లేదు. పేగుల్లోని కణాలను ఇన్ఫెక్ట్ చేసి అక్కడ వైరస్ కణాలను పెంచుకుంటోంది. పైగా శరీరంలో వైరస్లను నాశనం చేసే కణాలను ఉత్పత్తి చేసే జీన్స్ను కూడా రెచ్చగొడుతోంది. కొన్ని కేసుల్లో మనకు పనికొచ్చే మంచి కణాలపై అవి దాడి చేసేలా మారుస్తోంది. ఇటీవలి ఓ రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైంది. మామూలుగా కరోనా మనిషి ఊపిరితిత్తుల్లో చేరి అక్కడుండే ఏసీఈ2 ఎంజైమ్ సాయంతో ఎపిథీలియల్ కణాలను వశం చేసుకొని అక్కడే మరిన్ని వైరస్లను ఉత్పత్తి చేస్తుంది.
దీని వల్ల దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని కేసుల్లో నిమోనియా కూడా వస్తుంది. తాజా స్టడీలో పేగుల్లోని కణాలను కూడా వైరస్ ప్రభావితం చేస్తుందని వెల్లడైంది. పేగుల్లో ఎపిథీలియల్ కణాలుంటాయని, అక్కడ కూడా ఏసీఈ2 ఎంజైమ్ ఉంటుందని, కాబట్టి వైరస్ అక్కడా తిష్ట వేసి తన పని కానిస్తోందని సైంటిస్టులు తెలిపారు. పేగుల లోపలి పొరల్లో ఉండే ఎంటరోసైట్స్ను వైరస్ నాశనం చేస్తుందని ఎలక్ట్రానిక్ మైక్రోస్కొపీ ద్వారా గుర్తించామన్నారు.