- భూ వివాదాలపై ధరణిలోనే ఆప్షన్
- సమస్య పరిష్కారానికి ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ ఆప్షన్
- దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్ లాగిన్లోకి అప్లికేషన్
- ధరణిలో లక్ష దాటిన వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్
హైదరాబాద్, వెలుగు: భూవివాదాల పరిష్కారం కోసం ధరణిలోనే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పోర్టల్లో ‘అప్లికేషన్ఫర్ల్యాండ్ మ్యాటర్స్’ అనే ఆప్షన్ ఇచ్చింది. సమస్య ఉన్నవాళ్లు ఆ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఫిర్యాదు నేరుగా కలెక్టర్ లాగిన్లోకి చేరనుంది. పోర్టల్లో లాగిన్ అయ్యాక సిటిజన్ డాష్బోర్డులో రెండో ఆప్షన్గా ఉండే ‘అప్లికేషన్ఫర్ల్యాండ్ మ్యాటర్స్’పై క్లిక్ చేసి.. పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, అడ్రస్తో పాటు వివాదం ఉన్న భూమికి సంబంధించిన ప్రాంతం, సర్వే నెంబర్ వివరాలను నమోదు చేయాలి. పట్టాదారు పాస్బుక్ ఉంటే ఆ వివరాలనూ ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత తమ వివాదం సరిహద్దు (గెట్టు), విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, పట్టాదారు పాస్బుక్ సమస్యకు సంబంధించినది అయితే ఆ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఇవేవీ కాకపోతే ‘ఇతర’ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద ఉండే బాక్స్లో వివాదానికి సంబంధించి 300 అక్షరాలకు మించకుండా వివరణ రాయాలి. ఆ వివాదానికి సంబంధించి తమ దగ్గర ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే దరఖాస్తుదారుకు రశీదు వస్తుంది. తర్వాత కలెక్టర్ వద్దకు వెళ్లే ఆ దరఖాస్తును.. కలెక్టర్ నేతృత్వంలోని రెవెన్యూ ట్రిబ్యునళ్లు పరిశీలించి వివాదాలను పరిష్కరిస్తాయి.
2,672 నాలా కన్వర్షన్లు
ధరణి ద్వారా చేపట్టిన అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య బుధవారం నాటికి లక్ష దాటింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్ 2 నుంచి కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 570 తహసీల్దార్ ఆఫీసుల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్హోదాలో తహసీల్దార్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు ఆన్లైన్లో స్లాట్బుక్చేసుకుంటే సంబంధిత తహసీల్దార్లు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లను ఒకే రోజు పూర్తి చేస్తున్నారు. నవంబర్ 2 నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 4 వేల 240 దరఖాస్తులు రాగా.. బుధవారం నాటికి లక్షా 310 రిజస్ట్రేషన్లు, మ్యుటేషన్లను అధికారులు పూర్తి చేశారు. ఒక్కో రిజిస్ట్రేషన్కు సగటున 54 నిమిషాల టైం తీసుకుంటోంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మార్చుకునేందుకు డిసెంబర్ 16 నుంచి నాలా కన్వర్షన్ ఆప్షన్ను ప్రభుత్వం ధరణి పోర్టల్లో చేర్చింది. నాలా కన్వర్షన్ కోసం నెల రోజుల్లో 2,951 అప్లికేషన్లు.. 2,672 అప్లికేషన్లు అప్రూవల్ పొందాయి. నాఆల కన్వర్షన్ అప్రూవల్కు సగటున 20 నిమిషాలు పడుతోంది.