టోక్యో: రాత్రయినా, లైట్లు బంజేసినా చేతిల ఫోన్ పట్టుకుని గేమ్ ఆడేస్తుంటరు చాలా మంది. దాని ధ్యాసలో పడి నిద్ర వదిలేస్తరు. పొద్దుగాల లేవరు. అలాంటి వారి కోసమే ‘పోకెమాన్’ ఓ సరికొత్త గేమ్ను తీసుకొస్తోంది. అదే ‘పోకెమాన్ స్లీప్గేమ్’. అంటే నిద్రబోయి ఆడే ఆట అన్నమాట. నిద్రే ఒక ఆట అన్నమాట. 2020లో ఈ గేమ్ను తీసుకొస్తామని పోకెమాన్ కంపెనీ బుధవారం ప్రకటించింది. నిద్రనే ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తామని చెప్పింది. ‘‘నిద్రను ఎంటర్టైన్మెంట్ చేయడమే మా లక్ష్యం. సరైన టైంలో పడుకోవడం, పొద్దుగాల లేవడమే ఈ గేమ్” అని కంపెనీ ప్రెసిడెంట్ సునెకజు ఇషిహర చెప్పారు. ఈ గేమ్ను డెవలప్ చేస్తున్న నింటెండో మరికొన్ని వివరాలను చెప్పింది. ఆటగాళ్ల నిద్రను ట్రాక్ చేయడానికి ఓ పరికరాన్ని తయారు చేస్తున్నామని, అది ప్లేయర్ల నిద్రకు సంబంధించిన వివరాలను వారి వారి స్మార్ట్ఫోన్కు పంపుతుందని చెప్పింది. 2016లో పోకెమాన్ నుంచి వచ్చిన పోకెమాన్ గో ఆట ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసిందే. ఆటగాళ్ల లైవ్ లొకేషన్, కెమెరా, గ్రాఫిక్స్ అన్నింటిని లైవ్గా చూపిస్తూ లేని పోకెమాన్ను ప్రపంచమంతా వెతుకుతూ తిరగడమే ఆ గేమ్. దాని వల్ల కొందరు బోర్డర్లు దాటిపోయిన సందర్భాలున్నాయి. రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగాయి. ఈ గేమ్నూ డెవలప్ చేసిందీ నింటెండోనే. పోకెమాన్ గో పేరిట ఒక యాప్నే తీసుకొచ్చింది ఆ సంస్థ. ఇక, ఈ సరికొత్త ‘స్లీప్ గేమ్’పై నెటిజన్లు సరదా కామెంట్లు గుప్పిస్తున్నారు. నిద్రపోవడమే ఆటైతే దాని కోసం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకో ఆరుగంటలు ఎక్కువ పడుకునేందుకు గేమ్ తెస్తున్నరులే అంటూ కామెంట్ చేస్తున్నారు.