న్యూఢిల్లీ: భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడానికి ఫండ్స్ చాలా అవసరం. ప్రస్తుతం ప్రైవేట్ ఇన్వెస్టర్లతో కలిసి ప్రభుత్వం పీపీపీ మోడల్లో కొన్ని ప్రాజెక్ట్లు నిర్మిస్తోంది. కానీ, ఇప్పుడున్న పీపీపీ మోడల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కొత్త పీపీపీ మోడల్ను ప్రభుత్వం తీసుకురానుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్లకు లాభాలొచ్చేలా అవకాశాలు కలిపించనున్నారని వివరించారు. పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేసే మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ (ఎంసీఏ) కు కొన్ని మార్పులు చేయనున్నారు. స్టాండర్డ్ ఎంసీఏని ప్రభుత్వం తీసుకురానుందని, వివిధ సెక్టార్లలో దీనిని ఫాలో కానున్నారని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. స్టాండర్డ్ ఎంసీఏలో ప్రధానంగా ఇన్వెస్టర్లు ప్రాజెక్ట్లో డబ్బులు పెట్టడం ద్వారా వారికొచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇన్వెస్ట్ చేయడం వలన ఎలా లాభపడొచ్చనే అంశాలపై ఫోకస్ పెట్టనున్నారని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పీపీపీ మోడల్ను ప్రభుత్వం తీసుకురానుందని పేర్కొన్నారు.
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్పై ఫోకస్
కొత్త పీపీపీ మోడల్ను మొదట ప్రైవేట్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ తక్కువగా ఉన్న లేదా పూర్తిగా లేని సెక్టార్లలో అమలు చేయనున్నారు. వీటిలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మెట్రోలు వంటివి), రైల్వేస్, రోడ్లు వంటి సెక్టార్లు ముందున్నాయి. కొత్తగా తీసుకురానున్న ఎంసీఏను ప్రభుత్వ ఆర్గనైజేషన్లు, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లు ఫాలో కానున్నాయని సంబంధిత వ్యక్తులు వివరించారు. ఇండస్ట్రీకి తగ్గట్టు కొన్ని క్లాజ్లను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నారు. ‘ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లాభదాయకమే అనుకుంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. అలానే బ్యాంకులు అప్పులివ్వడానికి ముందుకొస్తాయి’ అని ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు ఇన్వెస్టర్లకు, బ్యాంకులకు లాభాలిచ్చేలా మార్చాలని చూస్తున్నామని, ఈ ప్రాజెక్ట్లు తనకు తానుగా ఫండ్స్ జనరేట్ చేసుకునేలా చేయాలనుకుంటున్నామని అన్నారు. దేశంలోని పట్టణాల్లో జనాభా వేగంగా పెరుగుతోంది. వీరి అవసరాలను తీర్చడానికి వచ్చే 15 ఏళ్లలో 840 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని అంచనా. కొత్త పీపీపీ మోడల్ తీసుకురావడంపై ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వివిధ సెంట్రల్ మినిస్ట్రీలతో కలిసి పనిచేస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పీపీపీ మోడల్ లాభదాయకంగా మార్చేందుకు ప్రారంభంలో కొన్ని సెక్టార్లకు ప్రభుత్వం సాయం చేస్తుందని వివరించారు.
‘మెట్రో’ మోడల్ మాదిరే..
హైదరాబాద్, బెంగళూరులలోని మెట్రో ప్రాజెక్ట్లను చూస్తే ప్రైవేట్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ పొందేందుకు వివిధ అవకాశాలు క్రియేట్ చేయడం కనిపిస్తుంది. మెట్రో పిల్లర్లను యాడ్స్ పెట్టుకోవడానికి లీజుకిస్తున్నారు. కమర్షియల్ స్పేస్ను ప్రైవేట్ ఇన్వెస్టర్లకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఈ మెట్రో ప్రాజెక్ట్లను నిర్మించడానికి పీపీపీ కింద ప్రైవేట్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినా, క్యాష్ ఫ్లోస్ను జనరేట్ చేసుకోవడానికి వీలుకలుగుతోంది. ఈ విధానంలోనే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త పీపీపీ మోడల్ను తీసుకొచ్చే పనిలో ఉంది. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొన్ని సెక్టార్లలో యూజర్లపై ఛార్జీలు కూడా వేసే అవకాశం ఉంది. టెలికం, పోర్టులు, ఎయిర్పోర్టు సెక్టార్లలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు యూజర్ ఛార్జీల ద్వారా ప్రైవేట్ ఇన్వెస్టర్లను సక్సెస్ఫుల్గా ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం తన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను డెవలప్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగాలను క్రియేట్ చేయాలని చూస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా రూ.111 లక్షల కోట్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా, పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను చేపట్టడానికి, వాటిని పూర్తి చేయడానికి ప్రైవేట్ ఇన్వెస్టర్ల సాయం కూడా అవసరమని గుర్తుంచుకోవాలి.