
- ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకున్న కమిషన్
హైదరాబాద్,వెలుగు: రౌడీషీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్, పోస్ట్మార్టం నివేదిక కాపీలతో సహా పూర్తి నివేదికను నవంబర్ 24 నాటికి తనకు సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఎన్కౌంటర్ మరణాలపై సుప్రీంకోర్టు, ఎన్ హెచ్ఆర్ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక ఇవ్వాలని సూచించింది. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, మెజిస్టీరియల్ లేదా జ్యుడీషియల్ విచారణ స్థితి, వివరాలు అందించాలని పేర్కొంది. తనను అరెస్టు చేసే సమయంలో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను రియాజ్ హత్య చేసిన సంగతి తెలిసిందే.
రియాజ్ను ఇటీవల అరెస్టు చేసిన పోలీసులు.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించారు. ఈ క్రమంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ సర్వీస్ గన్ లాక్కొని కాల్పులు జరిపేందుకు రియాజ్ ప్రయత్నించాడని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పలు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది.