- మానవ అక్రమ రవాణా కేసులో ఏకకాలంలో సోదాలు
- మయన్మార్ శరణార్థులే టార్గెట్గా తనిఖీలు
ఢిల్లీ: తెలంగాణతో సహా దేశంలోని 8 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రెయిడ్స్ నిర్వహిస్తోంది. మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఈ సోదాలు చేపట్టింది. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, రాజస్తాన్, హరియాణాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరిలలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్న మయన్మార్కు చెందిన వ్యక్తిని జమ్మూలో అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ కశ్మీర్లోని బథిండి ప్రాంతంలో రోహింగ్యా ముస్లిం జాఫర్ అలామ్ను బథిండి ప్రాంతంలో అరెస్ట్చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తేలింది. మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టారు. పాస్పోర్ట్ యాక్ట్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఘటనలతో లింకు ఉన్న కేసుల్లో తనిఖీలు చేస్తున్నారు. గత నెలలో శ్రీలంకకు చెందిన పలువురిని తమిళనాడు మీదుగా బెంగళూరు, మంగళూరుకు అక్రమంగా తరలించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అనంతనాగ్, పుల్వామా జిల్లాలతో సహా దక్షిణ కశ్మీర్లో ఎస్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు.