
తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు ముమ్మరం చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సానుభూతిపరుల ఇండ్లు, షాపులు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సామాజిక సేవ ముసుగులో ట్రైనింగ్ ఇస్తూ యువతను ఉగ్రవాద కార్యక్రమాలవైపు మళ్లిస్తున్నారన్న అభియోగాలతో PFI నేతల ఇండ్లపై తనిఖీలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఈ సోదాలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం MS ఫారంలో షేక్ ముఖిద్ ఇంట్లో NIA అధికారుల సోదాలు ముగిశాయి. బ్యాంక్ అకౌంట్, లావాదేవీలపై NIA వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పాస్ పోర్టు సీజ్ చేసిన అధికారులు..బ్యాంక్ పాస్ బుక్ లను తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని NIA కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తాను సర్వీస్ సెంటర్ నిర్వహిస్తానంటూ NIA అధికారులకు చెప్పానని షేక్ ముఖిద్ తెలిపాడు.
జగిత్యాలలో NIA తనిఖీలతో ఒక్కసారిగా అలజడి రేగింది. NIA ఆఫీసర్లు సోదాలకు రావడం, స్థానిక పోలీసులు కూడా వెంట ఉండడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లోని 4 ఇళ్లతో పాటు , మెడికల్ షాపులో సోదాలు చేశారు. టవర్ సర్కిల్ ఏరియాలో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఒకరి ఇంట్లో డైరీతో పాటు పలు కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ NIA సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. తరచూ భైంసాలో అల్లర్లు జరుగుతుండడంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో NIA ఆఫీసర్లు తనిఖీలు చేశారు. శాంతినగర్ గుందేవార్ తోటలో అనుమానితున్ని NIA అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్ లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో బైంసాకు వచ్చినట్లు తెలుస్తోంది. భైంసాలో ఇద్దర్ని .... అదుపులోకి తీసుకున్నారు. వీరికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు.