
ముంబై: సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం సెషన్లో కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ కంపెనీల షేర్లు పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్ల నుంచి సపోర్ట్ దొరకడంతో ఇండెక్స్లు మార్నింగ్ సెషన్లోని నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 71,437 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో 309 పాయింట్లు పెరిగి 71,624 దగ్గర ఆల్టైమ్ హై నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 86 పాయింట్లు లాభపడి 21,505 దగ్గర జీవిత కాల గరిష్టాన్ని రికార్డ్ చేసింది. కానీ, ఈ లెవెల్ దగ్గర సస్టయిన్ కాలేక తిరిగి కిందకి పడింది. చివరికి 34 పాయింట్లు లాభంతో 21,453 దగ్గర సెటిలయ్యింది. ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గించడంతో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు మంగళవారం లాభపడ్డాయి.
వీటికితోడు కొన్ని బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు పెరగడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు పాజిటివ్గా క్లోజయ్యాయి. ఐటీ షేర్లు తమ నష్టాలను తగ్గించుకోగలిగాయి. సెన్సెక్స్లో నెస్లే, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి షేర్లు నష్టపోయాయి.
బ్రాడ్ మార్కెట్ పాజిటివ్గా కదిలిందని, కానీ ర్యాలీకి మాత్రం బ్రేక్లు పడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. యూరప్ ఇన్ఫ్లేషన్ వెలువడే ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారని చెప్పారు. ఏషియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై మార్కెట్లు పాజిటివ్గా, హాంకాంగ్ మార్కెట్ నెగెటివ్లో క్లోజయ్యాయి.