
- మరో ఇద్దరికి గాయాలు.. పంజాబ్లో నిహంగ్స్ దాడి
- తొమ్మిది మంది దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు
- వారి నుంచి పదునైన ఆయుధాలు, పెట్రోల్ బాంబులు స్వాధీనం
ఛండీఘర్: కర్ఫ్యూ పాస్లు చూపించాలని అడిగినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ పై దాడి చేసి అతడి చెయ్యి నరికేశారు పలువురు దుండగులు. వారి దాడిలో మరో ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్లోని పటియాలా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో వెజిటబుల్ మార్కెట్ దగ్గర నిహంగ్స్(సంప్రదాయ ఆయుధాలు ధరించి, లూజ్ బ్లూ టాప్ వేసుకుని తిరిగే సిక్కులు) నలుగురైదుగురు ఒక గ్రూప్గా ఓ వాహనంలో వెళుతున్నారు. వారిని అక్కడ ఆపిన పోలీసులు.. లాక్డౌన్ ఉండటంతో కర్ఫ్యూ పాస్ చూపించాలని అడిగారు.. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వారు అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన్దీప్ సింగ్ సిద్ధు చెప్పారు. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులపైనా వారు దాడి చేశారన్నారు. తమ దగ్గర ఉన్న కత్తితో ఒక ఏఎస్ఐ చేతిని నరికేశారని, ఒక ఎస్ హెచ్వో, మరో పోలీసు అధికారిక కూడా ఈ దాడిలో గాయపడినట్టు తెలిపారు. గాయపడిన ఏఎస్ఐని రజింద్రా హాస్పిటల్కు తరలించారని, అతడిని ఛండీఘర్లోని పీజీఐఎంఈఆర్ కు రిఫర్ చేశారన్నారు. పోలీసులపై దాడి చేసిన నిహంగ్స్ అక్కడి నుంచి పరారయ్యారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరో 20 మంది వరకూ నిహంగ్స్ ను అదుపులోకి తీసుకున్నారు. బల్బేరా గ్రామంలోని ఓ గురుద్వారాలో దాక్కున్న వీరి నుంచి పదునైన ఆయుధాలు, ఆటోమాటిక్ వెపన్స్, పెట్రోల్ బాంబులు, రూ.35 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.