న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్లో వైరస్ మరింత వేగంగా విరుచుకుపడుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా రోజూ లక్ష మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. తాజా లెక్కల ప్రకారం కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో ఇండియా రెండో ప్లేస్కు చేరింది. అమెరికా 3.19 కోట్ల కేసులతో తొలి స్థానంలో, ఇండియా 1.35 కోట్ల కేసులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు రెండో ప్లేస్లో ఉన్న బ్రెజిల్ మూడో ప్లేస్కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 6.32 లక్షల కేసులు నమోదవగా అందులో దాదాపు 1.7 లక్షల కేసులు ఇండియావే ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇది దాదాపు 27 శాతం. గత 7 రోజుల్లోనే దేశంలో దాదాపు 9.37 లక్షల కేసులు నమోదయ్యాయి. పోయిన వారంతో పోలిస్తే 70 శాతం పెరిగాయి. మొత్తంగా ప్రపంచంలో కొత్తగా నమోదవుతున్న ప్రతి 6 కేసుల్లో ఒకటి ఇండియాలోనే ఉంటోంది.
మహారాష్ట్రలో 63 వేలు
దేశంలో గత 24 గంటల్లో 1,68,912 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్రలో 63,294, ఉత్తప్రదేశ్లో 15,276, ఢిల్లీలో 10,774 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 35 లక్షలకు చేరింది. ప్రస్తుతం 12 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 8.8 శాతమని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. రికవరీ రేటు 89.86 శాతానికి పడిపోయిందని చెప్పింది. దేశంలో గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 83 శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో 75 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారంది. 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 24 గంటల్లో ఒక్క కరోనా మరణం నమోదవలేదని వెల్లడించింది.
అవసరమైతే లాక్డౌన్ పెడ్తం
కర్నాటకలో అవసరమైతే లాక్డౌన్ పెడ్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం చెప్పారు. ప్రజలు కరోనా రూల్స్ పాటించాలని, లేకుంటే లాక్ డౌన్ తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ తనతో మాట్లాడారని, తమ సర్కారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కర్నాటకలో గత 24 గంటల్లో 9,579 కేసులు నమోదయ్యాయి. 52 మంది మరణించారు.
మహారాష్ట్రలో 10, 12 పరీక్షలు వాయిదా
మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర సర్కారు సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా లాక్డౌన్కు ప్రత్యామ్నాయం లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పినట్టు శివసేన పత్రిక సామ్నా తాజాగా రాసుకొచ్చింది. లాక్ డౌన్ తోపాటు కఠినమైన ఆంక్షలు విధించాలని సీఎం అనుకుంటున్నారంది. ఢిల్లీలో కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. సోమవారం నుంచి అక్కడి ఆఫీసులు, మెట్రో రైళ్లు, బస్సుల్లో 50 శాతం కెపాసిటీ రూల్స్ను అమలు చేస్తున్నారు. హర్యానాలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రెండు గంటల కన్నా తక్కువ ప్రయాణ వ్యవధి ఉన్న విమానాల్లో భోజనం సప్లయ్ ను నిలిపివేయాలని ఎయిర్ లైన్స్ కంపెనీలను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశించింది.