
ఆమ్దా నీ డబుల్ చేసేందుకు 16 పాయింట్ల ఫార్ములా
మన దేశం.. వికసించిన వనం
పాలనలో అవినీతి లేదు.. దాపరికం లేదు
సబ్కా సాథ్ సబ్కా వికాస్.. మా లక్ష్యం
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి
2 గంటల 40 నిమిషాలు ప్రసంగించి తన రికార్డుతోనే బద్దలు కొట్టిన నిర్మల
మధ్యమధ్యలో కవితలు.. సూక్తులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. వాటికి సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు ప్రకటించారు. వారికి ప్రధాని మోడీ కూడా జత కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ శనివారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆమె బడ్జెట్ స్పీచ్ బ్రేక్ లేకుండా 2 గంటల 40 నిమిషాల పాటు కొనసాగింది. ఇంత టైం బడ్జెట్ ప్రసంగాన్ని ఇచ్చిన తొలి ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మల రికార్డులకెక్కారు. గత ఏడాది రెండు గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టారు. కొన్ని విషయాలను రెండుమూడు సార్లు ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. కశ్మీర్ కవితను మొదట చదివిన ఆమె.. దాన్ని హిందీలో వివరించారు. ‘మన దేశం.. వికసించిన షాలీమార్ వనం/ మన దేశం.. దాల్సరస్సులో విరబూసిన కమలం’ అంటూ ఆ కవితను నిర్మల చదువుతుంటే బీజేపీ సభ్యులందరూ బల్లలు చరుస్తూ ఆనందం వెలిబుచ్చారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ గురించి వివరిస్తున్నప్పుడు మహిళా ఎంపీలు అదే స్థాయిలో హర్షం ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పాలనలో అవినీతి లేదని, దాపరికం లేదని నిర్మల స్పష్టం చేశారు.
మోడీ లీడర్షిప్లో అంకితభావంతో..
నిరుడు మేలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరిచారని, ప్రజల నమ్మకాన్ని నిలబెడుతామని ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. మోడీ లీడర్షిప్లో దేశ ప్రజలకు తాము అంకితభావంతో సేవ చేస్తామని తెలిపారు. ప్రజల ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచేలా బడ్జెట్ ఉంటుందని, ఇది సామాన్యుల బడ్జెట్ అని ఆమె తెలిపారు. ఇప్పుడున్న యూత్ అంతా కొత్త శతాబ్దం ప్రారంభంలో పుట్టినవాళ్లేనని, వాళ్ల భవిష్యత్తు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ రూపొందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఉన్నతమైన జీవితాన్ని అందించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
జీఎస్టీ చీఫ్ ఆర్కిటెక్ట్ జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్జైట్లీ సేవలను నిర్మల గుర్తుచేసుకున్నారు. ‘జీఎస్టీ చరిత్రాత్మక నిర్ణయం. దీని చీఫ్ ఆర్కిటెక్ట్ అరుణ్జైట్లీ ఇప్పుడు మన మధ్య లేరు. ఆయనకు నా నివాళులు. ఒకే దేశం.. ఒకే పన్ను వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్ససంబంధాలు మరింత బలపడుతాయని, కామన్ గోల్ నెరవేరుతుందని జైట్లీ చెప్పేవారు. అది మనందరికీ కనిపిస్తోంది” అని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమన్నారు. జీఎస్టీతో వినియోగదారులకు ఏటా రూ.లక్ష కోట్ల లాభం చేకూరుతోందని, ఇప్పటివరకు 40 కోట్ల జీఎస్టీ రిటర్న్లు దాఖలైనట్లు వివరించారు. జీఎస్టీ శ్లాబ్ల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందని, చెక్పోస్టుల వద్ద ఇన్స్పెక్టర్ రాజ్ వ్యవస్థ తొలగిపోయిందన్నారు. జీఎస్టీ అమలు తర్వాత సామాన్యులకు నెలవారీ ఖర్చు 4 శాతం ఆదా అయిందని నిర్మల వివరించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల పూర్తి ఫలాలు ప్రజలకు అందడం లేదని, ఒక రూపాయిలో కేవలం 15 పైసలే లబ్ధిదారులకు చేరుతున్నాయని మాజీ ప్రధాని నెహ్రూ చెప్పేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో ప్రధాని మోడీ.. నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల లబ్ధిచేకూరుస్తున్నారని ఆమె తెలిపారు. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అందరికీ మంచినీళ్లు, శానిటేషన్, హెల్త్ కేర్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రుణ సదుపాయం, బీమా సౌకర్యం, పెన్షన్ స్కీం, హౌస్ ఫర్ ఆల్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
ఎకానమీలో మనది ఐదో స్థానం
ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎకానమీలో మన దేశం ఐదో అతిపెద్ద దేశమని నిర్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు కూడా తగ్గాయన్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు మనకు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారి ఆదాయాన్ని పెంచడం, వారి జీవితాల్లో మార్పులు తేవడం తమ కర్తవ్యమన్నారు. మూడు థీమ్స్గా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మొదటి థీమ్లో ‘ఆస్పిరేషనల్ ఇండియా’, రెండో థీమ్లో ‘ఎకనమిక్ డెవలప్మెంట్ఫర్ ఆల్’, మూడో థీమ్లో ‘కేరింగ్ ఇండియా’ చేర్చినట్లు వివరించారు.
భూమిని దున్నితేనే భుక్తి
2022 వరకు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. ఇందుకోసం 16 సూత్రాల విధానాన్ని వివరించారు. కిసాన్ రైల్వే, కిసాన్ ఉడాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, గ్రామీణ స్టోరేజ్ స్కీమ్, ధాన్యలక్ష్మి వంటి పథకాలను ప్రకటించారు. ప్రతి జిల్లా ఎక్స్పోర్టు హబ్గా మారాలని అన్నారు. ఈ సందర్భంగా సంగం యుగం నాటి తమిళ కవయిత్రి అవ్వయార్ మాటలను కోట్ చేశారు. ‘ఆత్తిచూడి’ గా ప్రసిద్ధి పొందిన అవ్వయార్ సూక్తులు.. ఇప్పటి ఎకానమీకి సరిపోతాయని నిర్మల అన్నారు. ‘భూమి తిరుథి ఉన్ (భూమిని దున్నితేనే భుక్తి)’ అనే అవ్వయార్ మాటలు ఆచరణీయమని తెలిపారు. భూమిని దున్ని, విత్తనాలు విత్తి, నీళ్లు పెట్టి, కలుపు తీసి తర్వాతే పంట చేతికి వస్తుందని, ఎకానమీ కూడా అటాంటిదేనని వివరించారు. క్రీ.పూ. 3300 నాటి హరప్పా నాగరికతలోనూ కామర్స్, ట్రేడ్ఉన్నాయని, వాటికి సంబంధించిన అప్పటి పదాలను సభలో ఆమె వినిపించారు.
సబ్ కా విశ్వాస్
2030 వరకు ప్రపంచంలో ‘వర్కింగ్ ఏజ్ పాపులేషన్’ ఎక్కువగా ఉన్న దేశంగా ఇండియా నిలుస్తుందని తెలిపారు. త్వరలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తామన్నారు. బేటీ బచావో.. బేటీ పడావోకు మంచి స్పందన వస్తోందని, చదువుకునే వారిలో మగ పిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందాల్సిందేనన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్లను ఏడుగా విభజిస్తున్నామని, ట్యాక్స్ భారాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్’ నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు.
‘‘మన దేశం.. వికసించిన షాలీమార్ వనం
మన దేశం.. దాల్ సరస్సులో విరబూసిన కమలం
మన దేశం.. యువతలో ఉరకలెత్తే ఉడుకు రక్తం
నా దేశం.. నీ దేశం.. మనందరి దేశం..
ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన దేశం’’
.. అంటూ పండిట్ దీననాథ్ కౌల్ రాసిన కశ్మీరీ కవితను నిర్మల చదివి వినిపించారు. ఇటీవలే యూటీలుగా ఏర్పడ్డ జమ్మూకాశ్మీర్, లడాఖ్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
సూర్యుడు.. రాజు
కాళిదాసు రచించిన రఘువంశంలోని కొన్ని వాక్యాలను నిర్మల తన ప్రసంగం చివర్లో ప్రస్తావించారు. ‘నీటి బిందువులను ఆవిరి రూపంలో సూర్యుడు తీసుకుంటాడు. రాజు కూడా అదే రీతిలో కొద్దిపాటి పన్నులను వసూలు చేస్తాడు. అందుకు ప్రతిఫలంగా భారీ వర్షాలను సూర్యుడు ఇస్తే.. ప్రజలకు కావాల్సిన సదుపాయాలను రాజు ఇస్తాడు” అంటూ కాళిదాసు కోట్స్ను ఆమె వివరించారు.
మంచి దేశమంటే..
దేశమంటే ఎలా ఉండాలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్తన ‘తిరుక్కురల్’ గ్రంథంలో పేర్కొన్న అంశాలను చదివి వినిపించారు. మంచి దేశానికి కావాల్సినవి ఐదు ఆభరణాలంటూ తిరువళ్లువర్ వివరించారని గుర్తుచేశారు. అవి ఆరోగ్యం, సంపద, పంటలు, ఆనందం, రక్షణ అని తెలిపారు. 2వేల ఏండ్ల క్రితం ఆ కవి చెప్పిన ఐదు ఆభరణాలను దేశానికి ప్రధాని మోడీ అందిస్తున్నారని.. ప్రజల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ను ప్రవేశపెట్టారని, సంపదను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారని, పంటల కోసం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారని, ప్రజల ఆనందానికి పెద్దపీట వేస్తున్నారని, దేశ రక్షణ, భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
బడ్జెట్ హైలైట్స్
2 గంటల 40 నిమిషాల సేపు సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్. స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో చివరి రెండు పేజీలను చదవకుండానే ప్రసంగం ముగించారు.
ఇన్కం టాక్స్ చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు.. పాత శ్లాబులతో పాటు కొత్త శ్లాబుల ప్రకటన. ట్యాక్స్ పేయర్లే ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం. కొత్త స్లాబ్లో 70 శాతం మినహాయింపుల తొలగింపు.
బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కవరేజీ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు.
ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు రూ.1.7 లక్షల కోట్ల కేటాయింపు. ఉడాన్ స్కీమ్కు ప్రోత్సాహం కలిగించేలా 2024 నాటికి దేశంలో మరో 100 ఎయిర్ పోర్ట్ల అభివృద్ధికి చర్యలు. ఇంటర్నేషనల్, నేషనల్ రూట్లలో కృషి ఉడాన్ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు. బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు రూ.18,600 కోట్లు.
నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఇకపై ఒకే పరీక్ష. ఇందు కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 తేజస్ రైళ్లు. పర్యాటక కేంద్రాలతో లింకింగ్. రైల్వే ట్రాక్లకు రెండువైపులా సోలార్ కేంద్రాలు.
చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఏడాది పాటు ట్యాక్స్ హాలీడే. కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు. దీనిపై పన్నును రిసీవర్లే చెల్లించాలి. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆడిటింగ్ మినహాయింపు.
ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీలో వాటాల విక్రయం. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్. స్టాక్మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయం.
పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు. సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం రూ.4,400 కోట్లు.
హెరిటేజ్ పరిరక్షణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు.
లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ. నేషనల్ గ్రిడ్తో లక్ష గ్రామాల అనుసంధానం
ఇండియాలో చదవాలనుకునే విదేశీ స్టూడెంట్ల కోసం స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం.. ఇండ్ శాట్. త్వరలో కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకటన.
వ్యవసాయ రంగం అభివృద్ధికి 16 సూత్రాల పథకం. సోలార్ పంప్ సెట్ల స్కీమ్ మరో 20 లక్షల మంది రైతులకు వర్తింపు. పాలు, మాంసం, చేపల వంటి వాటి రవాణా కోసం కిసాన్ రైలు.
కాశ్మీరీ కవి పండిట్ దీనానాత్ కౌల్ నదీమ్, కవితలు, భక్తురాలు అవ్వయార్ సూక్తులు, తిరువళ్లువర్ రచనల్లోని ఐదు లక్షణాలు, మహాకవి కాళిదాసు రాసిన వాక్యాల ప్రస్తావన.
నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
దేశంలో మొబైల్ఫోన్లు, ఎలక్ట్రిక్ వస్తువుల తయారీని ప్రోత్సహించేందుకు కొత్త పథకం.
ఒక మేజర్ పోర్ట్ను కార్పొరేటైజ్ చేసేందుకు సన్నాహాలు
వచ్చే మూడేళ్లలో పాత విద్యుత్ మీటర్ల స్థానంలో ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు. దీని ద్వారా తమకు కావాల్సిన సప్లయర్ను కన్స్యూమర్ ఎంపిక చేసుకునే అవకాశం.
అమ్మాయిల మ్యారేజ్ ఏజ్పై సూచనల కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదన.