
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను కాంగ్రెస్ షురూ చేసింది. ఈ యాత్ర ‘మిషన్ నిరుద్యోగి’ పేరిట రెండు బస్సుల్లో పది రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో జరగనుంది. బుధవారం గన్పార్క్ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుద్యోగులతో పాటు కాంగ్రెస్ నేతలు అజయ్కుమార్, అద్దంకి దయాకర్, రియాజ్, చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని తెలిపారు. పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా రాలేదన్నారు. జరిగిన పలు పోటీ పరీక్షలనూ సరిగ్గా నిర్వహించలేకపోయిందని ఫైర్ అయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులు పల్లెల్లోకి వెళ్లి ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమేనని హరగోపాల్ పేర్కొన్నారు.