- గడ్కరీ క్లారిఫికేషన్
- ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటివి వాడాలని సూచన
న్యూఢిల్లీ: పొల్యూషన్ తగ్గించే క్రమంలో డీజిల్ వెహికల్స్పై అదనంగా 10 శాతం జీఎస్టీ విధించాలనే ప్రపోజల్ ఉందని తాను కామెంట్ చేసినట్లు వచ్చిన వార్తలను గడ్కరీ ఖండించారు. సియామ్ యాన్యువల్ కన్వెన్షన్లో పాల్గొన్న తాను డీజిల్ వెహికల్స్ కారణంగా పొల్యూషన్ ఎక్కువవుతోందనే కామెంట్ చేసినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. కానీ, గడ్కరీ వ్యాఖ్యలు వైరల్ కావడంతో స్టాక్ మార్కెట్లో ఆటోమొబైల్ షేర్లు నష్టాలపాలవడమే కాకుండా, కొన్ని గంటలపాటు గందరగోళం నెలకొంది. ఈ అయోమయాన్ని తొలగించేందుకు గడ్కరీ ఆ తర్వాత, డీజిల్ వెహికల్స్పై అదనపు జీఎస్టీ ప్రపోజల్ ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ట్వీట్ చేశారు.
కాలుష్యం తగ్గించడానికి క్లీనర్ ఫ్యూయెల్స్ వాడటం మేలని గడ్కరీ సూచించారు. 2070 నాటికి కార్బన్ నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశలో ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా డీజిల్ వెహికల్స్ ఎక్కువగా పొల్యూషన్కు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఇంధనాల వినియోగం బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గాలని, ఇందుకోసం దేశంలోనే తగిన ఆల్టర్నేటివ్ ఫ్యూయెల్స్పై ఫోకస్ పెట్టాలని కూడా సూచించారు. పన్నులు పెంచితే డీజిల్ వెహికల్స్ విక్రయించడం కష్టమవుతుందనే అర్ధం వచ్చేలా గడ్కరీ మాట్లాడినట్లు రిపోర్టులు వచ్చాయి.
ఆల్టర్నేటివ్ ఫ్యూయెల్స్పై ఫోకస్ పెంచండి
దేశంలోని చాలా కమర్షియల్ వెహికల్స్ ప్రధానంగా డీజిల్తోనే నడుస్తున్నాయి. దీంతో గడ్కరీ చేసినట్లుగా చెబుతున్న కామెంట్స్ కొంత సంచలనం సృష్టించాయి. పాసింజర్ వెహికల్స్ కేటగిరీలో డీజిల్కార్ల అమ్మకాలను మారుతి సుజుకి ఇండియా, హోండా కంపెనీలు నిలిపివేశాయి. డీజిల్ కార్ల సంఖ్య తగ్గిందని, మాన్యుఫాక్చరర్లు వాటిని అమ్మకుండా ఉంటే మేలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అభిప్రాయపడ్డారు. తన ఇంధన అవసరాలను ప్రధానంగా డీజిల్, పెట్రోల్ వంటి ఫాజిల్ ఫ్యూయెల్స్ ద్వారానే ఇండియా నెరవేర్చుకుంటోందని, ఈ కారణంగా రెండు సవాళ్లను దేశం ఎదుర్కోవల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకటి ఆర్థికపరమైన సవాలైతే రెండోది కాలుష్యమని వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్తోపాటు, బయో ఫ్యూయెల్స్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ఆల్టర్నేటివ్ ఇంధనాల వినియోగం పెరగాలని చెప్పారు. దేశంలో రోడ్లను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఏటా 15 నుంచి 18 శాతం చొప్పున గ్రోత్ సాధిస్తోందని, ఫాజిల్ ఫ్యూయెల్స్ వినియోగం ఎక్కువవడానికి ఇది కూడా కారణమవుతోందని అన్నారు. ఈ గ్రోత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఆనందం కలిగిస్తుందని, కానీ పొల్యూషన్ వల్ల ప్రజలు బాధితులవుతారని గడ్కరీ పేర్కొన్నారు. అందుచేత, వీలైనంత తొందరగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు గుడ్బై చెప్పమని కంపెనీలను ఆయన కోరారు. దేశంలో ప్రస్తుతం ఆటోమొబైల్ వెహికల్స్పై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కాంపెన్సేషన్ సెస్ 22 శాతం దాకా ఉన్న విషయం తెలిసిందే. ఇథనాల్ వంటి ఎకో ఫ్రెండ్లీ ఇంధనాలపై దృష్టి పెట్టమని ఆటోమొబైల్ పరిశ్రమను గడ్కరీ కోరారు.