న్యూఢిల్లీ: కొన్ని నిర్దిష్టమైన కేసులపై శిక్షలు వేయకూడదని (డీక్రిమినలైజ్) జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో ట్యాక్స్ అధికారులను తన డ్యూటీ చేయకుండా అడ్డుపడడం, కావాలనే మెటీరియల్ సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం, ఇన్ఫర్మేషన్ను ఇవ్వడంలో ఫెయిలవ్వడం వంటివి ఉన్నాయి. అలానే జీఎస్టీ కింద ట్యాక్స్ అమౌంట్ రూ.2 కోట్లను మించితేనే అధికారులు విచారణ చేసేలా రూల్స్ సవరించింది. ముందు ఈ అమౌంట్ రూ. కోటిగా ఉంది. రూ. కోటి కంటే ఎక్కువ అమౌంట్ను ఫేక్ ఇన్వాయిసింగ్ చేస్తే విచారణ జరపడాన్ని కొనసాగించింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) పై 22 శాతం కాంపెన్సేషన్ సెస్ను వేయడాన్ని జీఎస్టీ కౌన్సిల్ క్లారిఫై చేసింది. మల్టీ యుటిలిటీ వెహికల్స్ (ఎంయూవీ) లను డిఫైన్ చేసేందుకు త్వరలో కొన్ని పారామీటర్స్ను ప్రకటిస్తామంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48 వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ శనివారం జరిగింది. టైమ్ సరిపోకపోవడం వలన మొత్తం 15 అంశాల అజెండాలో కేవలం ఎనిమిదింటిపైనే నిర్ణయం తీసుకున్నామని సీతారామన్ పేర్కొన్నారు. ఈసారి జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కొత్తగా ట్యాక్స్లు వేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
పాన్ మసాలా, గుట్కాలపై ట్యాక్స్ మార్పు, ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు వంటి వాటిపై లెవీ వంటి అంశాలు శనివారం జరిగిన మీటింగ్లో ప్రస్తావనకు రాలేదు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల (జీఓఎం) రిపోర్ట్లోని వివిధ అంశాలపై తాజా మీటింగ్లో పట్టించుకోలేదు. 1,500 సీసీ ఇంజిన్ కెపాసిటీ, 4,000 మిల్లీ మీటర్ల పొడవు, కనీసం 170 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న బండ్లను ఎస్యూవీల కింద పరిగణస్తామని సీతారామన్ పేర్కొన్నారు. వీటిపై 22 శాతం కాంపన్సేషన్ సెస్ కొనసాగుతుందని అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ పేయర్ల బేస్ను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రస్తుతం 1.40 కోట్ల మంది జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు రిజిస్టర్ అయ్యారని వివరించారు.