తాగునీటి కోసం అలమటిస్తున్న అడవి జంతువులు

తాగునీటి కోసం అలమటిస్తున్న అడవి జంతువులు
  • గతేడాది పోసిన నీళ్లకు ఫండ్స్​రిలీజ్​ చేయని  ప్రభుత్వం
  • పైసలు లేక నామ్​కే వాస్తేగా వ్యవహరిస్తున్న బీట్​ఆఫీసర్లు 
  • తాగునీటి కోసం అలమటిస్తున్న అడవి జంతువులు
  • ప్రభుత్వం వెంటనే ఫండ్స్​రిలీజ్​ చేయాలని డిమాండ్​

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లాలో తాగునీరు లేక అడవి జంతువులు అలమటిస్తున్నాయి. ఫారెస్ట్​లో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్​పిట్లలో బీట్​ఆఫీసర్లు నామ్​కే వాస్తే గా నీళ్లు పోస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 82వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాందారి, మాచారెడ్డి, బాన్సువాడ, పిట్లం, జుక్కల్​మండలాల్లో విస్తరించి ఉన్న ఫారెస్ట్​లో మనుబోతులు, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవి ఆలుగులు తదితర వన్యప్రాణులు వేల సంఖ్యలో ఉండగా, చిరుత పులులు, ఎలుగు బంట్లు, అడవి కుక్కలు పదుల సంఖ్యలో ఉన్నాయి.  

జిల్లాలో 220 కి పైగా సాసర్​ పిట్లు

2010 నుంచి జిల్లాలోని ఫారెస్ట్ లో అధికారులు సాసర్ ​పిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 8 అటవీ రేంజ్​ల పరిధిలో 220కి పైగా సాసర్​ పిట్లు ఉన్నాయి. ఏటా  ఫిబ్రవరి నుంచి మే వరకు వన్యప్రాణులు దాహార్తిని తీర్చేందుకు సాసర్​ పిట్లలో తప్పకుండా నీళ్లు పోయాలని ఫారెస్ట్​ ఉన్నతాధికారులు  నిర్ణయించారు. ఒక్కో సాసర్​పిట్​లో పది రోజులకోసారి  నీళ్లునింపాలని ఆదేశాలు జారీ చేశారు. 4 నెలల పాటు జంతువుల తాగునీటి  లక్షల రూపాయల ఫండ్స్​ను ప్రభుత్వం కేటాయిస్తోంది.  

నామ్​కే వాస్తేగా నింపుతున్న  ఫారెస్ట్​ ఆఫీసర్లు

నీటిని నింపే బాధ్యతను ప్రభుత్వం బీట్​ఆఫీసర్లకు అప్పగించింది. కానీ బీట్​ఆఫీసర్లు నెలలో 3 సార్లు నీటిని పోయాల్సి ఉండగా,  ఎప్పుడో ఒకసారి పోసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు చెప్తున్నారు. ఎల్లారెడ్డి రేంజ్​ పరిధిలోని ఆయా  బీట్లలోని సాసర్​ పిట్లలో ఇంతవరకు నీటిని పోయలేదు. మాచారెడ్డి, పిట్లం, నాగిరెడ్డిపేట రేంజ్​ల  పరిధిలో అడపాదడపా పోస్తుండగా, మిగతా  రేంజ్​లలో సాసర్​ పిట్లు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి. దీంతో జంతువులు గ్రామాల శివార్లలో ఉండే  చెరువులు, వ్యవసాయ   బోర్ల వద్దకు తాగునీటి కోసం వస్తుండగా, వేటగాళ్లు  అమర్చిన కరెంట్ షాక్​, ​ ఉచ్చుల్లో పడి చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డబ్బులు  ఇవ్వకపోవడంతోనే .. 

గత ఏడాది పోసిన నీళ్ల డబ్బులు  ప్రభుత్వం నేటికీ  చెల్లించక పోవడంతోనే  బీట్​ఆఫీసర్లు సాసర్​ పిట్లలో నీళ్లు పోయడం లేదని  తెలుస్తోంది.  సాసర్​ పిట్లలో నీళ్లు పోయడానికి అయ్యే ఖర్చును   సెక్షన్​, బీట్​ ఆఫీసర్లు  సొంతంగా భరించారు. కానీ  ప్రభుత్వం ఇప్పటి వరకు ఫండ్స్​రిలీజ్​ చేయలేదు. ఈ ఏడాది కూడా పైసా విడుదల చేయకపోవడంతో చాలా  ప్రాంతాల్లోని సాసర్​ పిట్లలో నీటిని  పోయడం లేదు. ‘ నీళ్లు పోయాలని ఆదేశిస్తున్నారు.. కానీ పైసలు మాత్రం ఇస్తలేరు’ అని ఓ బీట్​ఆఫీసర్​ బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా వెంటనే ఫండ్స్​రిలీజ్​చేసి   వన్యప్రాణుల దప్పిక తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

రేంజ్​ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాం

వన్యప్రాణుల దూప తీర్చేందుకు  ఏర్పాటు చేసిన సాసర్​పిట్లలో నీళ్లు పోయించాలని గతంలోనే  రేంజ్ బీట్​ ఆఫీసర్లకు  ఆదేశాలిచ్చాం.  ప్రభుత్వం నిధులు మంజూరు కాగానే బిల్లులు చెల్లిస్తాం. గతేడాది పోసిన నీళ్లకు బిల్లులు రాని మాట వాస్తవమే.. రాగానే రెండు బిల్లులు చెల్లిస్తాం. 
గోపాల్​రావు,  ఎఫ్​డీవో, కామారెడ్డి