పాక్, అఫ్గాన్ కార్గో షిప్​లకు అదానీ పోర్టుల్లో నో ఎంట్రీ

పాక్, అఫ్గాన్ కార్గో షిప్​లకు అదానీ పోర్టుల్లో నో ఎంట్రీ

న్యూఢిల్లీ: దేశంలో పోర్టులు నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్​ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టెర్మినళ్ల నుంచి ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్ లకు సరుకు రవాణాను నిలిపేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. నవంబర్​ 15 నుంచి ఆ దేశాలకు ఎగుమతులు, దిగుమతులు ఉండబోవని స్పష్టం చేసింది. అదానీ పోర్ట్స్‌‌‌‌ అండ్‌‌‌‌ సెజ్‌‌‌‌ (ఏపీ సెజ్‌‌‌‌) నిర్వహించే  టెర్మినల్స్‌‌‌‌, ఏపీ సెజ్‌‌‌‌ పోర్టుల్లోని థర్డ్‌‌‌‌పార్టీ టెర్మినళ్లకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. తర్వాతి నోటీసులు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందంది.ఈ ఏడాది సెప్టెంబర్​ 13న గుజరాత్​లోని ముండ్రా పోర్టులో 3 వేల కిలోల డ్రగ్స్​పట్టుబడిన నెలలోనే అదానీ పోర్ట్స్​ఈ నిర్ణయం తీసుకుంది. ముండ్రా పోర్టులో భారీ స్థాయిలో హెరాయిన్​​పట్టుబడటంతో అదానీ పోర్ట్స్​పై తీవ్ర విమర్శలొచ్చాయి. ప్రాసెస్​ చేయని టాల్క్​ పౌడర్​తో పాటు హెరాయిన్​ను జంబో బ్యాగుల్లో తరలించారు. ఎవరూ గుర్తించకుండా కంటెయినర్​లో కింద బ్యాగుల్లో హెరాయిన్, పై బ్యాగుల్లో టాల్క్​ పౌడర్​ సెట్​ చేశారు. రూ.20 వేల కోట్ల విలువైన ఈ డ్రగ్స్​ను కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులు సీజ్​ చేశారు. దేశవ్యాప్తంగా రైడ్స్​ చేసి దీంతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీళ్లలో అఫ్గాన్, ఉజ్బెకిస్తాన్​లకు చెందిన వాళ్లున్నారు. పోర్టులో డ్రగ్స్​ దొరకడంపై సోషల్​ మీడియాలో బాగా విమర్శలు రావడంతో అదానీ గ్రూప్​ స్పందించింది. ‘దేశంలోని ఏ పోర్టు ఆపరేటర్​ కూడా కంటెయినర్లలో ఏముందో చెక్​ చేయరు. అందరి పని కూడా పోర్టులు నడిపించడం వరకే. వచ్చి పోయే కంటెయినర్లపై మాకేం పోలీసింగ్​ అథారిటీ లేదు’ అని వివరణ ఇచ్చింది.