
కననాస్కిస్(కెనడా): ఇండియా–పాక్మధ్య సీజ్ ఫైర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం, జోక్యం లేదని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. ఈ విషయంపై అమెరికా ప్రెసిడెంట్డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్మిస్రీ వెల్లడించారు. ట్రంప్, మోదీ 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారని, ఈ సంభాషణకు సంబంధించిన వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు.
ద్వైపాక్షిక చర్చలతోనే ఒప్పందం కుదిరిందని మోదీ చెప్పారన్నారు. ఇకముందు కూడా మూడో దేశం జోక్యం అవసరంలేదని మోదీ తేల్చేశారన్నారు. ట్రంప్ గతంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకున్న వ్యాఖ్యలను మోదీ ఖండించారన్నారు. కాగా, జీ7 సదస్సుకు అనుబంధంగా మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడంతో ఈ భేటీ రద్దయింది.
టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా దాడులు చేసినం
పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను ట్రంప్కు మోదీ వివరించారని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వివరించారు. ‘‘ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ట్రంప్.. మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అండగా ఉంటామని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. తాజాగా జీ7 సదస్సులో భాగంగా ట్రంప్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్కు ఇండియా ఎలా బుద్ధి చెప్పిందో ట్రంప్కు వివరించారు.
పాకిస్తాన్ పదేపదే అభ్యర్థించడం వల్లే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేసినట్లు మోదీ తెలియజేశారు. కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి/దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్, పీవోకేలోని టెర్రరిస్ట్ క్యాంపులనే లక్ష్యంగా చేసుకుని ఇండియా దాడులు చేసిందని వివరించారు. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల టైమ్లో ఇండియా, అమెరికా మధ్య మధ్య వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. ఇండియాపై దాడులకు పాల్పడినా, ఉగ్రదాడికి దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ను హెచ్చరించినట్లు ట్రంప్కు మోదీ వివరించారు’’ అని విక్రమ్ మిస్రి తెలిపారు.