తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని ఏవియేషన్ శాఖ తెలిపింది. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కొత్తగూడెం, మరియు మహబూబ్నగర్లలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. అయితే ప్రభుత్వం సూచించిన ప్రదేశాలలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్వే నిర్వహించినట్లు ఏవియేషన్ శాఖ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం సూచించిన వరంగల్లోని మామునూర్.. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం వచ్చే 60 ఏండ్లలో 150 కిలోమీటర్లలోపు కొత్త ఎయిర్పోర్టులు నిర్మించడం సాధ్యం కాదని ఆ శాఖ తెలిపింది.
గురువారం లోకసభలో తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వరంగల్ ఎయిర్పోర్టు గురించి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానమిచ్చారు. విమానయాన శాఖ దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీని అమలుచేస్తుందని ఆయన తెలిపారు. ఆ నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఎయిర్ పోర్టు కంపెనీలు కానీ, లేదా కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ గ్రీన్ఫీల్డ్ పాలసీని పాటిస్తూ సైట్ క్లియరెన్స్ కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా వాటిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. వారు సూచించిన ప్రదేశాలలో స్థల సేకరణకోసం ఏవియేషన్ శాఖ స్టడీ చేసిందని ఆయన తెలిపారు. మామునూర్ ఎయిర్పోర్టు ఏడవ నిజాం చేత 1930లో నిర్మించబడింది. ఆ ఎయిర్పోర్టు దాదాపు 706 ఎకరాలలో విస్తరించబడి ఉంది. మామునూర్ ఎయిర్పోర్టు నుంచి 1981 వరకు విమానాలు నడపబడ్డాయి. ఈ ఎయిర్పోర్టు పేపర్ మిల్లు మరియు వీఐపీల కోసం బాగా ఉపయోగపడింది.
ఆదిలాబాద్లోని ఖానాపూర్ ఎయిర్పోర్టు కూడా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాడకంలో ఉండేది. ఈ ఎయిర్పోర్టు 369 ఎకరాలలో నిర్మించబడింది. ఈ ఎయిర్పోర్టును కూడా ఏవియేషన్ శాఖ సందర్శించింది.
For More News..