రాజీవ్​ స్వగృహ ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేస్తలే!

రాజీవ్​ స్వగృహ ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేస్తలే!
  •     రాజీవ్​ స్వగృహ ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేస్తలే!
  •      ఫుల్​పేమెంట్​ చేసినా పట్టించుకుంటలేరు
  •      ఆలస్యం చేస్తుండడంతో పైసలు వాపస్​ ఇవ్వాలని డిమాండ్​
  •      రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఎవరికీ ఆథరైజేషన్​ ఇవ్వని ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు: సర్కారే ప్లాట్లు అమ్ముతుండడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకున్నారు. అప్పులు చేసి మరీ డబ్బులు కట్టారు. నెలలు గడుస్తున్నా సర్కారు రిజిస్ట్రేషన్ ​మాటే ఎత్తకపోవడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, ప్లాట్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ ​చేయాలని, లేదంటే డబ్బులు రిటర్న్​ఇవ్వాలని డిమాండ్ ​చేస్తున్నారు. మహబూబ్​నగర్​లోని సారిక టౌన్​ షిప్​లో 240 ప్లాట్లను ఈ ఏడాది మార్చి 14 నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వం వేలం ద్వారా అమ్మింది. బిడ్లు వేసినంక ప్లాట్ల గజం ధర పెంచారని, ఇతర కారణాలతో 104 మంది డ్రాప్​ అయ్యారు. మిగిలిన 136 మంది సక్సెస్​ఫుల్​ బిడ్డర్లు ఉండగా, వారిలో 59 మంది ఫుల్​పేమెంట్​ చేశారు. వీరు బిడ్డింగ్​అమౌంట్ మొత్తం రూ.20.34 కోట్లకు 2శాతం రాయితీ పోగా రూ.19.94 కోట్లు చెల్లించారు. దీనికి సంబంధించి ఏప్రిల్​లో కలెక్టర్ ​ప్రొసీడింగ్​ఆర్డర్స్​ కూడా ఇచ్చారు. కానీ ఫుల్ ​పేమెంట్​కట్టిన వారికి ఇంకా ప్లాట్లను రిజిస్ట్రేషన్ ​చేయలేదు. 

ముందో మాట.. ఇప్పుడో మాట
వేలం జరగకముందు నిర్వహించిన సదస్సుల్లో ఫుల్​పేమెంట్ ​చేసినవారికి వెంటనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ ​చేస్తారని ఆఫీసర్లు చెప్పారు. లోన్లు తీసుకున్నవారికి మాత్రం అది క్లియర్​ అయినంక రిజిస్ట్రేషన్ ​డాక్యుమెంట్లు ఇస్తామని అన్నారు. కానీ, ఫుల్​పేమెంట్​ చేసినవారికి నెల రోజులు కావస్తున్నా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్​ చేయడానికి ఆథరైజేషన్​ పర్సన్​గా ఎవరినీ నియమించలేదని తెలిసింది. పైగా కలెక్టరేట్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సారిక టౌన్​షిప్​సెక్షన్​లో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని కొందరు బాధితులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను తమనే తెచ్చుకోమని చెబుతున్నారని అంటున్నారు. అసలు ప్లాట్​ బౌండరీలు ఎక్కుడున్నాయో కూడా తమకు తెలియడం లేదని చెబుతున్నారు. ఇండివిడ్యువల్​ ప్లాట్లకు అయితే కొన్నవారే డాక్యుమెంట్​ చేయించుకుంటారని, గవర్నమెంట్ ​వెంచర్లలో ఇది వర్తించదని, ఒకవేళ తాము డాక్యుమెంట్​ రైటర్లతో పేపర్లు తీసుకొచ్చినా, అందులో తప్పులు ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే డాక్యుమెంట్​ రైటర్లను పెట్టి, వారితో పేపర్లు తయారు చేయించాలని డిమాండ్​ చేస్తున్నారు.

లోన్లు రాక అప్పులు
బిడ్డింగ్​లో ప్లాట్లు విన్​ అయిన చాలామందికి బ్యాంకులు లోన్లు ఇవ్వలేదు. వారి సిబిల్​ స్కోర్​ తక్కువగా ఉందని లోన్లు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో లోన్లు రానివారు ప్రైవేట్​ వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకున్నారు. ఇప్పటికే కొందరు వడ్డీ డబ్బులు కూడా కడుతున్నారు. కానీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో చాలామంది కట్టిన పైసలు వాపస్​ ఇవ్వాలని కోరుతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రెండు రూపాయల వడ్డీకి తెచ్చి కట్టామని, తీరా ఇప్పుడు ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ ​చేయకుండా సతాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి కలెక్టరేట్​లోని ఓ సెక్షన్​ తహసీల్దార్​కు ఆథరైజేషన్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు కలెక్టరేట్​లోని కొందరు ఆఫీసర్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఉందని, అదే ఇక్కడా అమలవుతుందని అంటున్నారు. మోడల్​ రిజిస్ట్రేషన్ ​డాక్యుమెంట్లు ఇప్పటికే సేకరించామని, జిల్లా రిజిస్ట్రార్​తో మాట్లాడినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. మోడల్​ డాక్యుమెంట్లను ప్లాట్లు కొన్న విన్నర్లకు కూడా ఇచ్చారని, వారు ఆ మోడల్​ ప్రకారం పేపర్లు తీసుకొస్తే రిజిస్ట్రేషన్లు చేస్తారని వివరిస్తున్నారు.

అప్పు చేసి కట్టిన
బిడ్డింగ్​లో గెలుచుకున్న ప్లాట్​ను నాకు రిజిస్ట్రేషన్​ చేస్తలేరు. నా ప్లాట్​ విలువ రూ.30.90 లక్షలు.  2 శాతం రాయితీ ఇస్తారనడంతో రూ.10 లక్షలు చేతిపొంటి, రూ.20 లక్షలు లోన్​ తీసుకొని ఏప్రిల్ 30న కట్టిన. ఇంతవరకు రిజిస్ట్రేషన్​ చేయలే. బ్యాంకర్లు మాత్రం మార్టిగేజ్​ చేయడానికి డాక్యుమెంట్లు ఇవ్వాలని మాపై ఒత్తిడి తెస్తున్నరు. రిజిస్ట్రేషన్లకు ఇంతవరకు ఆథరైజ్డ్ పర్సన్​ను డిసైడ్​చేస్తలేరు. కలెక్టర్​ బాధ్యత తీసుకోవాలె. వాళ్ల తరఫున ఆఫీసర్​ను నియమించి రిజిస్ర్టేషన్ ​ప్రాసెస్ పూర్తి చేయాలె. - సంజీవ్​కుమార్, పాలమూరు

ఏం చెబుతలేరు
నేను ప్లాట్​ విన్ ​అయిన తరువాత 33 శాతం కట్టిన. తర్వాత లోన్​ రావడంతో మొత్తం రూ.19 లక్షలు కట్టిన. త్వరగా రిజిస్ట్రేషన్​ చేయమని కవరింగ్​ లెటర్ ​కూడా పెట్టిన. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్​ ఇయ్యలే. రెండు మూడు రోజుల్లో కలెక్టర్​ను కూడా కలిసి మాట్లాడతా. మేం మొత్తం పైసలు కట్టినం. మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్​ చేసి ఇయ్యాలె. - నాగిరెడ్డి, పాలమూరు