
- పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్
- ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ భేటీపై రియాక్షన్
- ఇండియా వైఖరి పట్ల ఎలాంటి నిరాశలేదని వెల్లడి
- మిడిల్ ఈస్ట్ అస్థిరమైతే.. ప్రపంచానికి శాంతి ఉండదు: జిన్ పింగ్
- అణు కేంద్రాలపై దాడి అంతర్జాతీయ రూల్స్కు విరుద్ధం: సౌదీ
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు
టెహ్రాన్/జెరూసలెం: ఇజ్రాయెల్ తోదాడులకు దీటుగా బదులిస్తూనే ఉంటామని, దాడులు ఆపేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ దాడులు ఆపేదాక అమెరికాతో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. జెనీవాలో యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతున్నానని, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
జెనీవాకు బయలుదేరేముందు అబ్బాస్ అరాగ్చీ మీడియాతో ఈ కామెంట్లు చేశారు. కాగా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి మూడో దేశం ఎంటరైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ కు ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ లంచ్ మీటింగ్ లో పాల్గొన్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ఆఫ్మిషన్ జావెద్ హొస్సేనీ శుక్రవారం ఈ మేరకు మీడియా సమావేశంలో స్పందించారు.
ఇరాన్ కు పాక్ మిత్రదేశమే అయినప్పటికీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే పాక్ భూభాగాన్ని వాడుకుని, ఇరాన్ పై దాడులు చేయాలన్న ప్లాన్ తోనే మునీర్ కు ట్రంప్ విందు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే యుద్ధంలో ఇరాన్ కు పాక్ సాయాన్ని దూరం చేయాలన్న ఎత్తుగడ కూడా ఇందులో ఉందని చెప్తున్నారు. కాగా, ఇండియా విషయంలో మాత్రం తమకు ఎలాంటి నిరాశ లేదని ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్తెలిపారు.
ఇండియాతో మంచి అవగాహన ఉందని, పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఇండియన్లను తరలించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుకు సహకరిస్తున్నామని తెలిపారు. అమెరికా సహా పాశ్చాత్య దేశాలే పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ విషయంలో ఐఏఈఏ ఇజ్రాయెల్ తరఫున పని చేస్తోందన్నారు.
ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న దాడులు..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మిసైల్, డ్రోన్ దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం పెద్ద ఎత్తున దాడులు చేసుకున్నాయి. ఇరాన్ లోని వివిధ ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్, మిసైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లపై శుక్రవారం ఉదయం 60 ఫైటర్ జెట్ లతో ఎయిర్ స్ట్రైక్స్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ డిఫెన్స్ రీసెర్చ్ సంస్థ హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి చేసినట్టు వెల్లడించింది. కేర్మాన్షా, తబ్రీజ్ ఏరియాల్లో యుద్ధ విమానాల స్థావరాలపై, రష్త్ సిటీలోని టార్గెట్లపై కూడా అటాక్ చేశామని పేర్కొంది.
అయితే, ఈ దాడులపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక దక్షిణ ఇజ్రాయెల్లోని పలు రెసిడెన్షియల్ ఏరియాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఆరంతస్తుల భవనం ఒకటి కూలిపోగా, ఐదుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని టెల్అవీవ్ ఇతర సిటీల్లో తరచూ సైరన్లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో బంకర్లలోకి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కాగా, వారం రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ లో 657 మంది చనిపోగా, 2 వేలకుపైగా మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ లో 24 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు.
అణు కేంద్రాలపై దాడి రూల్స్కు విరుద్ధం: సౌదీ
ఒక దేశంలో శాంతియుత అవసరాల కోసం నిర్వహిస్తున్న అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయడం అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని సౌదీ అరేబియా ఖండించింది.
మిడిల్ ఈస్ట్ అస్థిరమైతే.. ప్రపంచానికి శాంతి ఉండదు: జిన్ పింగ్
ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అస్థిరత్వం ఏర్పడితే ప్రపంచానికి శాంతి ఉండదని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో గురువారం జిన్ పింగ్ ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం చెప్పారని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఈ యుద్ధం మరింత ముదిరితే ఆ రెండు దేశాలతో పాటూ ఇతర దేశాలూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందని జిన్ పింగ్ తెలిపారు.
ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇజ్రాయెల్ తక్షణమే సీజ్ ఫైర్ ప్రకటించాలి” అని జిన్ పింగ్ కోరారని పేర్కొంది. కాగా, ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులను రష్యా ఇదివరకే ఖండించింది. ఇలాంటి దాడులు ప్రపంచానికే ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.