
న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్), ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ వల్ల తాము నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ చెప్పింది. ఈ రెండు ప్రోగ్రామ్స్ గేమ్ ఛేంజర్గా మారాయని వీటివల్ల తాము ఆటపై మరింత ఎక్కువగా దృష్టి సారిస్తున్నామంది. ‘మేం ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మా డబ్బులను వినియోగించుకోవాలి.
కానీ టాప్స్తో ఈ పద్ధతి మారిపోయింది. మేం మెడల్స్ ఎలా గెలవాలన్న దానిపై దృష్టి పెడితే సరిపోతున్నది. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఎక్కువ టోర్నీలు లేవు. అప్పుడు ప్లేయర్కు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా ఎక్కువగా కావాల్సి ఉండేది. ఖేలో ఇండియా కింద అది మాకు లభించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రధానమంత్రి చాలా మంది విమెన్ ప్లేయర్స్కు మద్దతుగా నిలిచాడు’ అని నేషనల్ కాన్క్లేవ్ మన్ కీ బాత్ @ 100 ప్రోగ్రామ్లో నిఖత్ పేర్కొంది.
మా మన్ కీ బాత్ వినండి...
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాను రెజ్లర్లు తీవ్రతరం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘మీరు మా మన్ కీ బాత్ వినడం లేదు. మీ ఎంపీపై వచ్చిన ఆరోపణలపై చర్చించడానికి సమయం ఇవ్వాలి. దేశం మొత్తం బేటీ బచావో, బేటీ పడావో అని అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇతరుల మన్ కీ బాత్ను పట్టించుకోవడం లేదు. మేం మెడల్స్ గెలిచినప్పుడు మీ ఇంటికి ఆహ్వానించారు. చాలా గౌరవం ఇచ్చారు. ఇప్పుడు అదే దృష్టితో మా గోస కూడా వినండి’ అని సాక్షి మాలిక్ పేర్కొంది.