
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025 కి గానూ నోబెల్ బహుమతి లభించింది. జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన సుసుము కిటగావా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్ , USAలోని బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒమర్ ఎం. యాఘీకి నోబెల్ అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
మెటల్ ఆర్గానికి ఫ్రేమ్ వర్క్స్ గా పిలిచే ప్రత్యేక మైన అణు నిర్మాణాలను అభివృద్ధి చేసినందుకు గానూ ఈ ముగ్గురికి నోబెల్ వరించింది. ఇవి లోహ అయాన్లను సేంద్రీయ అణువులతో అనుసంధానించడం ద్వారా ఏర్పడిన స్ఫటికాకార పదార్థాలు. అధిక పోరస్ నిర్మాణాలను ఏర్పరుస్తుంది.
ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్
క్వాంటమ్ టెక్నాలజీలో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు సైంటిస్టులకు ఈ ఏడాది ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకుడు జాన్ క్లార్కీ (83), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా బార్బరాకు చెందిన రీసెర్చర్లు మైకేల్ హెచ్. డివోరెట్(72), జాన్ ఎం. మార్టినిస్(67)ను అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ప్రక్రియల్లో వీరు చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 2025 ఫిజిక్స్ నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు వెల్లడించింది.