కొరోనిల్ ట్యాబ్లెట్ను కోవిడ్ కిట్లో చేర్చాలన్న పతంజలి అభ్యర్థనను ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్ తోసిపుచ్చింది. కొరోనిల్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) గుర్తించలేదని, కేంద్ర ప్రభుత్వం కూడా తన గైడ్లైన్స్లో చేర్చలేదని ఐఎమ్ఏ స్పష్టం చేసింది. రాందేవ్ బాబా చెప్పినట్లు కొరోనిల్ డ్రగ్ లేదా ఔషదం కాదని ఆ రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. కొరోనిల్ తయారీలో అల్లొపతి మందులను కూడా కలిపారని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొరోనిల్ను అనుమంతించలేమని, దానిని ఉపయోగించడం కోర్టుధిక్కారం అవుతుందని ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కొరోనిల్ అమ్మకాన్ని అనుమతించబోమని ఫిబ్రవరిలోనే ప్రకటించింది. WHO,IMA వంటి ఆరోగ్య సంస్థల నుంచి సరైన ధృవీకరణ లేకుండా కొరోనిల్ ట్యాబ్లెట్ను మహారాష్ట్రలో అమ్మకానికి అనుమతించమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కాగా.. హర్యానా ప్రభుత్వం మాత్రం కరోనా పేషంట్లకు లక్ష కొరోనిల్ కిట్లను పంపిణీ చేస్తామని మే నెలలో ప్రకటించింది. ఈ కిట్లకు అయిన ఖర్చులో సగం తమ ప్రభుత్వం భరిస్తుందని.. మిగిలిన సగం ఖర్చు పతంజలి భరిస్తోందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు.