- ఫేక్ న్యూస్పై స్పందించిన ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్..ఫేక్ న్యూస్..క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకో మూడు నెలల్లోనే రూ. కోట్లను సంపాదించొచ్చని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారనే వార్తలు ఆన్లైన్లో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ వార్తలు ఫేక్ అని ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా ప్రకటించారు. తొందరగా డబ్బులు సంపాదించే లూప్హోల్ను మహీంద్రా కనిపెట్టారని, మూడునాలుగు నెలల్లోనే ఇన్వెస్టర్లు మిలియనీర్లుగా మారిపోవచ్చని బ్లాస్దిఇన్కమ్.క్లబ్ ప్లాట్ఫామ్లో వచ్చింది. ఈ వార్తకు ఆనంద్ మహీంద్రా రెస్పాండ్ అయ్యారు. ‘ఒక్క రూపాయి కూడా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేయలేదు’ అని మహీంద్రా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ఆన్లైన్ ఆర్టికల్ గురించి తనకెవరో చెప్పారని అన్నారు. తప్పుడు వార్తలతో ఫేక్ న్యూస్ మరోలెవెల్కు తీసుకెళ్లారని, ఈ విషయం గురించి పబ్లిక్కు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కల్పితమైన ఈ తప్పుడు వార్త గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఫేక్ న్యూస్ను కొత్త లెవెల్కు తీసుకెళ్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఫేక్ న్యూస్కు సంబంధించిన నాలుగు స్క్రీన్షాట్లను కూడా షేర్ చేశారు. ప్రమాదకరం, అనైతికం కాకపోయి ఉంటే, ఈ ఆర్టికల్ ఫన్నీగా అనిపించేదని అన్నారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్కు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అతుల్ కస్బెకర్ రిప్లై ఇచ్చారు. ఈ ఆర్టికల్ను పోస్ట్ చేసిన ప్లాట్ఫామ్పై దావా వేయాలన్నారు. టాటా మాజీ చైర్మన్ రతన్ టాటా చెప్పాడనే కొన్ని వార్తలు కిందటేడాది ఏప్రిల్, మే నెలలో సర్క్యూలేట్ అయిన విషయం తెలిసిందే. న్యూస్ సోర్స్లను వెరిఫై చేసుకోవాలని, వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ను నమ్మొద్దని ప్రకటించారు. ‘ఏదైనా చెప్పాలనుకుంటే నా అఫీషియల్ అకౌంట్ నుంచే నేనే చెబుతా’ అని ఆయన అప్పుడు ట్విటర్ ద్వారా ప్రకటించారు. తన ఫోటోతో ఉండే కొటేషన్స్ తాను చెప్పినట్టు కాదని వివరణ ఇచ్చారు.