పట్టాదారులకు నోటీసులు..! బకాయి పేమెంట్ చెల్లించకుంటే సర్వే నెంబర్లు బ్లాక్

పట్టాదారులకు నోటీసులు..! బకాయి పేమెంట్ చెల్లించకుంటే సర్వే నెంబర్లు బ్లాక్

 

  • 'ఎడిట్'​ ఆప్షన్​తో భూభారతిలో తక్కువ చలాన్ చెల్లింపు
  • రిజిస్ట్రేషన్​ యాక్ట్​ సెక్షన్​ 47 ఏ ప్రకారం పట్టాదారులకు ఆర్​ఆర్​ యాక్ట్​ కింద తప్పనిసరి నోటీసులు జారీ 
  • పేమెంట్​చెల్లించని డాక్యూమెంట్ల ల్యాండ్​ బ్లాక్ చేసే అవకాశం

యాదాద్రి, వెలుగు:  భూముల రిజిస్ట్రేషన్ల చలాన్ చెల్లింపులో జరిగిన అక్రమాలు మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్​ చేయించుకున్న యజమాని చలాన్  కోసం నిర్వాహకులకు పేమెంట్​ మొత్తం చేసినా..  చెల్లింపులు మాత్రం తక్కువగా జరిగాయి.  

అయితే చలాన్  తక్కువగా చెల్లింపు జరిగిన డాక్యుమెంట్ల పట్టాదారులకు మిగిలిన పేమెంట్​మొత్తం చెల్లించాలని జనగామలో నోటీసులు జారీ చేశారు. యాదాద్రి జిల్లాలో నోటీసులు జారీ చేసే విషయంలో రెవెన్యూ​ఆఫీసర్లు హయ్యర్​ఆఫీసర్ల ఆదేశాల కోసం చూస్తున్నారు.  నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా  బకాయిపడిన మొత్తం చెల్లించని పక్షంలో డాక్యుమెంట్లను బ్లాక్​ చేసే అవకాశం ఉంది.

సెక్షన్​47ఏ ప్రకారం చలాన్ 

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం చలాన్​చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్​ అండ్​ రిజిస్ట్రేషన్​యాక్ట్​47ఏ ప్రకారం నిర్ణయించిన భూమి విలువకు అనుగుణంగా చలాన్ పేమేంట్​చేయాల్సి ఉంటుంది.  కుమారుడికి భూమిని గిప్ట్​ డీడ్ చేస్తే విలువలో 3 శాతం, కుమార్తెకు 6.5 శాతం, ఇతరులకు రిజిస్ట్రేషన్​ చేస్తే 7 శాతం ఫీజును చలాన్ రూపంలో పేమెంట్​చేయాల్సి ఉంటుంది. 

చలాన్ చెల్లింపులో చేతి వాటం

ధరణి, భూ భారతి పోర్టల్స్​అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్​ బాధ్యత తహసీల్దార్లు నిర్వహిస్తున్నారు.  భూ భారతి పోర్టల్​లోని ‘సిటిజన్​’లోని ఎడిట్​ఆప్షన్​ద్వారా ఇంటర్నెట్​ మీ సేవ సెంటర్ల నిర్వాహకులు, డాక్యూమెంట్​ఆపరేటర్లు కొందరు చలాన్ చెల్లింపులో చేతివాటం ప్రదర్శించి పేమెంట్​ తక్కువ చేస్తూ, మిగిలిన మొత్తాన్ని రూ. కోట్లలో తమ సొంత అకౌంట్లకు మళ్లించుకున్న సంగతి తెలిసిందే. 

ఈ వ్యవహారం జనగామ జిల్లాలో వెలుగు చూడడంతో చర్యలకు దిగిన ప్రభుత్వం యాదాద్రి జిల్లాలో 1367, జనగామ జిల్లాలో 122  డాక్యూమెంట్లలో చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించింది.  చేతివాటం ప్రదర్శించిన నిర్వాహకులను ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్​మెంట్ గుర్తించి, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయడం జరిగిపోయింది. వారిలో కొందరు పోలీసుల అదుపులో ఉండడం, మరికొందరిని అదుపులోకి తీసుకోవడానికి పోలీస్​ డిపార్ట్​మెంట్​ చర్యలు ప్రారంభించింది. 

డాక్యుమెంట్లు బ్లాక్​ చేసే అవకాశం...?

ఇండియన్​స్టాంప్​అండ్​రిజిస్ట్రేషన్​యాక్ట్​1899 సెక్షన్​ 47 ఏ ప్రకారం మార్కెట్​ విలువలో నిర్ణయించిన ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్​ కోసం నిర్వాహకులకు పూర్తి స్థాయిలో ఫీజు చెల్లింపులు జరిపినా, ప్రభుత్వ ఖజానాకు తక్కువ చేరడంతో పట్టాదారులు డిఫాలర్లుగా తేలారు. తక్కువ​ చెల్లించిన చాలన్​ను రెవెన్యూ రికవరీ (ఆర్​ఆర్)​ యాక్ట్​ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా పట్టాదారులకు నోటీసులు జారీ చేస్తారు. 

సదరు పట్టాదారుడు బకాయిగా ఉన్న అమౌంట్​ చెల్లించాల్సి ఉంటుంది. నోటీసులు జారీచేసినా పేమెంట్​ చేయని పక్షంలో ఆయా డాక్యుమెంట్లలోని సర్వే నెంబర్ల భూమిని బ్లాక్​  చేస్తారు. దీంతో ఆ సర్వే నెంబర్ల భూమి క్రయ విక్రయాలు జరగే అవకాశం ఉండదు. ఆలస్యమైన బకాయిలకు 18 శాతం వడ్డీతో కలిపి వసూలు చేయవలసి ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు.  

యాదాద్రిలో పట్టాదారులకు నోటీసులు..!

జనగామ జిల్లాలో తక్కువగా పేమెంట్​ చేసిన 80 డాక్యూమెంట్లకు సంబంధించిన పట్టాదారులకు అక్కడి తహసీల్దార్లు నోటీసులు జారీ చేశారు. స్టాంప్​అండ్​ రిజిస్ట్రేషన్​ యాక్ట్​47ఏ ప్రకారం చలాన్ చెల్లించనందున మిగిలిన మొత్తం చెల్లించి, డాక్యుమెంట్లను రెగ్యులర్​చేయించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

 జనగామలో నోటీసులు జారీ చేయడంతో యాదాద్రిలోనూ 1017 డాక్యుమెంట్లకు చెందిన పట్టాదారులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు చెందిన ఆఫీసర్లు చెబుతున్నారు. హయ్యర్​ ఆఫీసర్ల  నుంచి వచ్చిన ఆదేశాల రాగానే నోటీసులు జారీ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని, సంక్రాంతి సెలవుల తర్వాత జారీ చేసే అవకాశం ఉందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు.